నారాయణ ఖేడ్ లో కాంగ్రెస్ విజయం ..మధిరలో పట్టు సాధించిన భట్టి .. టీఆర్ఎస్ కు షాక్
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.
మంత్రి ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్ .. ధర్మపురిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఫలితాలు
నారాయణ ఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం
ఇప్పటికే జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు , కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి పట్టు నిలుపుకోగా నారాయణఖేడ్ ఫలితాల్లో సత్తా చాటింది. మొత్తం నారాయణ ఖేడ్ లో ఉన్న 15 వార్డుల్లో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 7 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. నారాయణ ఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయ్యింది. దీంతో నంబర్ గేమ్ మొదలయినట్టే అని తెలుస్తుంది.
సత్తుపల్లిలో టీఆర్ఎస్ విజయం
ఇక ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల పరిస్థితి చూస్తే సత్తుపల్లిలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. సత్తుపల్లి 23 వార్డుల్లో 6 వార్డులు ఏకగ్రీవం కాగా మరో 7 వార్డుల్లో టీఆర్ ఎస్ గెలుపొందింది. దీంతో మొత్తం 13 వార్డుల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పాలి. దీంతో సత్తుపల్లి టీఆర్ఎస్ ఖాతాలో పడినట్టు భావించొచ్చు ఇప్పటికే చైర్మన్ పదవికి అవసరమైన స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
మధిరలో కూటమి ముందంజ .. పట్టు నిలుపుకున్న భట్టి
ఇక వైరా మున్సిపాలిటీ గమనిస్తే మొత్తం 6 వార్డుల్లో ఒక్క వార్డు సీపీఐ గెలిచింది . మిగతా వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే సీపీఐ గెలిచినా వార్డు రీ కౌంటింగ్ లో టీఆర్ఎస్ విజయం సాధించినట్టు ప్రకటించటంతో అక్కడ మళ్ళీ రీ కౌంటింగ్ నిర్వహించాలని సీపీఐ పట్టు పడుతుంది . మధిరలో కూటమి ఆధిక్యంలో ఉంది . మొత్తం 22 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్ష పార్టీల కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది . మధిరలో భట్టి విక్రమార్క తన పట్టు నిలుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో ఒక్క వార్డులోనే టీఆర్ఎస్ ముందంజలో ఉంది.