కేసీఆర్ ఎక్కడ పని చేశావ్, అంబేడ్కర్ను అవమానిస్తావా, 5ఏళ్ల టైమ్ వృథా: మోడీ
Recommended Video
హైదరాబాద్: కేసీఆర్ను ఎన్నుకొని తెలంగాణ ప్రజలు అయిదేళ్లు నష్టపోయారని, మరోసారి నష్టపోవద్దని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. ఎల్బీనగర్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. మత రిజర్వేషన్లు అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీఏ 1, యూపీఏ 2లు మేడం రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నాయని సోనియా గాంధీని ఉద్దేశించి మోడీ అన్నారు. బీజేపీ పాలన మాత్రం ప్రజల పాలన అన్నారు. విపక్షాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాము ఒక్క రక్తపు చుక్కపడకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ పాలనలో అయిదేళ్ల సమయం వృథా అయిందని చెప్పారు.
మజ్లిస్ పార్టీది మరో రకమైన రాజకీయం: నరేంద్ర మోడీ
కేసీఆర్ ఎక్కడెక్కడ పని చేశారు?
కేసీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పని చేశారని ప్రధాని మోడీ నిలదీశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పని చేశారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేశారని, చంద్రబాబు నాయుడు ఆయన గురువు అన్నారు. ఆ తర్వాత యూపీఏలో చేరారని, కేంద్రమంత్రి అయ్యారని, అప్పుడు సోనియా గాంధీ ఆయన గురువు అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సహజ మిత్రులు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్, మజ్లిస్, తెరాసలు నాణేనికి ఒకేవైపు ఉన్న రెండు బొమ్మలు అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ ఢిల్లీలో సోనియా గాంధీకి మొక్కలేదా
కాంగ్రెస్, తెరాస పార్టీలది ఒకే విధానమని మోడీ చెప్పారు. కేసీఆర్ రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్తోనే మొదలైందన్నారు. ప్రజలను తికమకపెడుతున్న ఇతర పార్టీల అసలు రంగు తెలుసుకోవాలని కోరారు. కాంగ్రెస్, తెరాసలు వ్యతిరేక పార్టీలుగా కనబడుతున్నప్పటికీ రెండు పార్టీలది ఒకే ఆలోచన అన్నారు. యూపీఏ 1లో కేసీఆర్ కేంద్రమంత్రి పదవి చేపట్టారన్నారు. తెలంగాణ ఏర్పడగానే ఢిల్లీలో సోనియా గాంధీకి మొక్కలేదా అన్నారు. కేసీఆర్, చంద్రబాబులకు ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీయే గురువు అన్నారు.
డిసెంబర్ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగు
డిసెంబర్ 7వ తేదీ తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగు అవుతాయని మోడీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ జేడీఎస్ అన్నారు. అలాంటి జేడీఎస్ను కాంగ్రెస్ పార్టీ కలిశారు కదా అన్నారు. దీనిని బట్టే ఎవరిది బీ టీమ్ అనేది తెలుస్తుందని చెప్పారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, ఆ ఇంటిని మహిళ పేరు మీద, ఆ ఇంటికి విద్యుత్, నీరు ఇలా అన్ని వసతులు ఇస్తామని చెప్పారు.
మత రిజర్వేషన్లు అంటే అంబేడ్కర్ను అవమానించడమే
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం అంటే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను అవమానించడమేనని మోడీ అన్నారు. మత రిజర్వేషన్లు అడ్డుకోవడం దేశంలోని వారి అందరి బాధ్యత అన్నారు. మత రిజర్వేషన్లు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి రిజర్వేషన్లు లాక్కుంటారా అని నిలదీశారు. సుప్రీం కోర్టు పరిమితులు విధించిన విషయం తెలియదా అన్నారు. మైనార్టీలకు రక్షణ లేదంటూ కొన్నిపార్టీలు ఉద్రేకాలు రెచ్చగొడుతున్నాయని చెప్పారు. కేసీఆర్ దొడ్డిదారిన రిజర్వేషన్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కుర్చీ కోసం ఎస్సీలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ఎవరి మధ్య విభేదాలు రాకుండా నాడు వాజపేయి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకు పోతున్నాయని చెప్పారు.