వీణా-వాణీ: 14ఏళ్ల వ్యథ తీరేదెప్పుడు?
హైదరాబాద్: గత 14ఏళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణీల శస్త్ర చికిత్స ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. దీంతో తమ అవిభక్త పిల్లలను చికిత్స ద్వారా వేరుచేసి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తారని అనుకున్న వీణావాణీల తల్లిదండ్రుల బాధ అలాగే ఉండిపోతోంది.
గతంలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా వీణా వాణీలను వేరుచేస్తామని చెప్పినప్పటికీ సక్సెస్ రేటు తక్కువగా ఉందని వారు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత లండన్ నుంచి వచ్చిన వైద్యులు కూడా మొదట సానుకూలత వ్యక్తం చేసి.. ఆ తర్వాత వారు కూడా విరమించుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వైద్యుల బృందం కూడా చికిత్సపై స్పష్టత ఇవ్వలేకపోయింది.
ఈ నేపథ్యంలో తమకు ఏదైనా జీవన భృతిని కల్పిస్తేగానీ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లలేమని ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులు చెప్పారు. కాగా, వీణావాణీల వయస్సు 12ఏళ్లు నిండినందున వారిని నీలోఫర్ నుంచి వేరే ఆస్పత్రికి తరలించనున్నట్లు ఇటీవల తెలంగాణ వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. చికిత్సపై మరోసారి ఎయిమ్స్ వైద్యులకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే వీణా వాణీలను స్టేట్ హోంకు తరలించే అవకాశం ఉంది. కాగా, వీణావాణీల వయస్సు పెరుగుతున్న కారణంగా వారిని విడదీసే అవకాశాలు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వీణావాణీల వయస్సు 14ఏళ్లు.
వీణా వాణీలను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ
నల్గొండలో జన్మించిన ఈ అవిభక్త కవలల ఆపరేషన్ అంశం తొలిసారి డిసెంబర్ 2004లో వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని జనరల్ ఆస్పత్రిలో డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ తొలి దశ ఆపరేషన్ చేశారు. కాగా, ఈ క్రమంలో రాజకీయ నాయకులు, అధికారులు ఆస్పత్రిని తరచూ సందర్శించడం వల్ల వీణావాణీల విషయంపై మీడియాలో ప్రచారం ఎక్కువగా జరిగింది.
వీణా-వాణీ
పేదరికం కారణంగా వీణావాణీల తల్లిదండ్రులు వారికి శస్త్రచికిత్స చేయించలేక ప్రభుత్వ సాయాన్ని కోరారు. 2006లో గుంటూరు ఆస్పత్రి నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి వీణావాణీలను తరలించడం జరిగింది. అప్పట్నుంచి ఈ అవిభక్త కవలలు అక్కడే ఉంటున్నారు.
అవిభక్త కవలలు
2008లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి న్యూరోసర్జన్ డా. ఆశీష్ మెహతా ఈ అవిభక్త కవలలను పరిశీలించారు. కానీ, ఆపరేషన్ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మెడికో ఎథికల్ కమిటీ సర్జరీపై హామీ ఇస్తే వారిని వేరే చేసేందుకు తాము సిద్ధమేనని మిడ్ డే పత్రిక(17-07-2008న)కు సదరు వైద్యుడు చెప్పినట్లు తెలిసింది.
లండన్ వైద్యులు
ఆ తర్వాత సింగపూర్లోని ఈస్ట్ షోర్ ఆస్పత్రి న్యూరోసర్జన్ డా. కేత్ గోహ్ కూడా ఈ అవిభక్త కవలను వేరే చేసే అవకాశాలను పరిశీలించేందుకు భారత్ వచ్చారు. అయితే, ఆయన కూడా స్పష్టత ఇవ్వకుండానే వెళ్లిపోయారు. 2015, ఫిబ్రవరిలో తాము వీణావాణీలను వేరు చేస్తామంటూ లండన్కు చెందిన వైద్యులు డా. డేవిడ్ దునవే, డా. ఓవాసే జీలానీలు భారత్ వచ్చి పరిశీలించారు.
తల్లిదండ్రులతో..
వారిని వేరు చేసేందుకు సుమారు ఐదు సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఆరు నుంచి 8 నెలల సమయం పడుతుందని లండన్ వైద్యులు చెప్పారు. అయితే, ఆపరేషన్ విజయవంతమయ్యే అవకాశాలు 80శాతం వరకే ఉన్నాయని తెలిపారు.
తప్పని వేదన
కాగా, ఈ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ కు ఓ లేఖ రాసింది. అవిభక్త కవలలకు అయ్యే ఖర్చులు మొత్తం తామే భరిస్తామని, చికిత్స చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2015లో ఎయిమ్స్ వైద్యుల బృందం హైదరాబాద్ వచ్చి కవలలను పరిశీలించారు. వారు కూడా సర్జరీ కొంత కష్ట సాధ్యమైన విషయం చెప్పారు.
ఇది ఇలా ఉండగా, కొన్ని రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంది. వీణావాణీల పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి భారీ ఎత్తున డబ్బులు విరాళంగా సేకరించిందని పలువురు టిఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన రూ. 4లక్షలను నీలోఫర్ ఆస్పత్రి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తిరిగిచ్చేసింది.
హైదరాబాద్లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కూడా తదుపరి సర్జరీకి కావాల్సిన ఇంట్రా అర్టిరియల్ డిజిటల్ సబ్ట్రాక్షన్ అంజియోగ్రాఫీ(డీఎస్ఏ) పరికరాలను సిద్ధం చేసుకుంది. అయితే, చికిత్స ఎప్పుడు ప్రారంభించేది తేల్చలేదు.
‘డీఎస్ఏ పూర్తవగానే ఎయిమ్స్ నుంచి వచ్చే వైద్యులు అవిభక్త కవలలను పరిశీలిస్తారు. ఆ తర్వాత చేయాల్సిన చికిత్సపై వారు నిర్ణయం తీసుకుంటారు. శస్త్రచికిత్స కారణమిదే. అవిభక్త కవలల తల్లిదండ్రులు కూడా సర్జరీకి అనుమతించారు' అని నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. సురేష్ తెలిపారు.