కీలక డైరీ దొరికింది, నన్ను అంతమొందించే కుట్ర: రేవంత్ సంచలనం, అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా ఖూనీ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి నివాసంలో, ఆయనకు చెందిన వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయని, ఇందులో రూ.17.51 కోట్ల నగదు దొరికిందని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఎఫెక్ట్!: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు, డబ్బు పట్టుబడిందా?
ప్రధాని నరేంద్ర మోడీ ఐటీ అధికారులు, ఈసీ పైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అందుకే రూ.50 లక్షలు మాత్రమే దొరికాయని చెబుతున్నారని చెప్పారు. పోలీసులు, ఎన్నికల అధికారుల ముడుపుల వివరాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రహస్య నివేదికను తొక్కిపెట్టారని చెప్పారు.
కొడంగల్లో ఎన్నికలు వాయిదా వేయించాలనే ప్రయత్నం
ఆర్కే నగర్లో దినకరన్ డబ్బులు పంచుతున్నప్పుడు ఎన్నికలను ఎలా వాయిదా వేశారని రేవంత్ ప్రశ్నించారు. ఆర్కే నగర్ ఎన్నికలను వాయిదా వేసినట్లు కొడంగల్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని అన్నారు. కొడంగల్ అభ్యర్థి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు దొరికిందని, దానిని అధికారులు దాస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ ఖూనీ చేశారని చెప్పారు.
సోదాల్లో కీలక డైరీ దొరికింది, దాచిపెడుతున్నారు
ఐటీ అధికారుల సోదాల సమయంలో కీలక డైరీ దొరికిందని దానిని కూడా దాస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసును మాఫీ చేసే విధంగా ఐటీ అధికారులపై తెరాస నేతలు ఒత్తిడి తెచ్చారని చెప్పారు. నిజా నిజాలు బయటకు తెలిస్తే మీకు పుట్టగతులు ఉండవని ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. తనను ఎదుర్కోలేక ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఒత్తిడితో ఎన్నికల అధికారి గోప్యత పాటిస్తున్నారన్నారు.
నన్ను అంతమొందించే కుట్ర
ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు తాను రోడ్డు పైన మీడియాతో మాట్లాడటానికి కారణం ఉందని, తాను ఇక్కడి నుంచి కొడంగల్ వెళ్తున్నానని, ఏ క్షణమైనా తనపైన దాడి జరగవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పినా ఇప్పటి వరకు కేంద్రం ఇవ్వలేదని చెప్పారు. తనను అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు.
అధికారులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
తాను అనుమానించినట్లుగానే రూ.100 కోట్లతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచనతో తెరాస నాయకులు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాన ఎన్నికల అధికారికి సీల్డ్ కవర్ అందిందని చెబుతున్నారని, ఆ సీల్డ్ కవర్ విప్పడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ పంపిస్తున్న నగదు వాహనాలను సరఫరా చేసేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు.
ఈ పోలీసులపై నాకు నమ్మకం లేదు
కొడంగల్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. డీజీపీ, డీఐజీ, ఇంటెలిజెన్స్ ప్రబాకర్లను తక్షణమే బదలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంపై డేగ కన్ను వేయాలని తన విజ్ఞప్తి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.