కిడ్నాప్ చేస్తానంటూ కాల్ మనీ వేధింపు: సస్పెండెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్/ఖమ్మం: కాల్ మనీ పేరుతో హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలువురిని వేధింపులకు గురిచేసిన మాజీ కానిస్టేబుల్ చల్లా నాగులును కేపీహెచ్బీ పోలీసులు సంగారెడ్డిలో అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీలో షేర్ మార్కెట్ వ్యాపారం చేసే రామకృష్ణారావుకు నాగులు 2010లో రూ.24లక్షలు ఇచ్చాడు.
ఆ సమయంలో అతడి వద్ద నుంచి 12 చెక్కులు తీసుకున్నాడు. ఇప్పటివరకు అతడి వద్ద 24 లక్షల అప్పుకు గానూ రూ. కోటి వరకు వసూలు చేశాడు. అంతేగాక, మరో కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం బిజినెస్లో నష్టాలు రావడంతో రామకృష్ణారావు కొంత కాలంగా డబ్బులు చెల్లించడం లేదు.
రామకృష్ణారావు ఇంటి చిరునామా తెలుసుకొని నాగులు బెదిరించడం మొదలు పెట్టాడు. చల్లా నాగులు సర్దార్పటేల్నగర్లో నివాసముంటున్నాడు. రామకృష్ణరావుకు ఫోన్లు చేసి డబ్బులు ఇస్తావా? లేక పోతే నిన్ను, నీ కుమారుడ్ని కిడ్నాప్ చేయమంటావా? అని బెదిరింపులకు దిగాడు. దీంతో వారం క్రితం రామకృష్ణరావు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలోనే చల్లా నాగులుపై అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలతో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ ఆరోపణలతో పోలీసులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా రుణాలిస్తూ.. బెదిరింపులకు దిగుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
నాగులుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సీహెచ్ కుషాల్కర్ తెలిపారు. కాగా, నాగులుపై ఖమ్మం వన్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం అతనిపై ఆరు కేసులున్నట్లు తెలిసింది.