సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
గజ్వేల్ : మెదక్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చర్చానీయాంశంగా మారింది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపుతోంది. 12వ బెటాలియన్కు చెందిన వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా వలిగొండ మండలం చాడ గ్రామానికి చెందినవారు. విధి నిర్వహణలో భాగంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో డ్యూటీ చేస్తున్నారు. అయితే బుధవారం (16.10.2019) నాడు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందారు.
కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో హెడ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే కొంత కాలంగా విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిపారు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్. ఆ క్రమంలో అతన్ని విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. అదలావుంటే వెంకటేశ్వర్లు భార్య తన భర్తను ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ వేడుకున్న కారణంగా అతడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట.. సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటూ..!
వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే మద్యం మత్తులోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు కమిషనర్ వెల్లడించారు. అదలావుంటే వ్యక్తిగత సమస్యల కారణంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.