కెసిఆర్ వరాలు: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, డిఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాంట్రాక్టు ఉద్యోగులకు, డిఎస్సీ ఆశావహులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆయన వరాలు ప్రకటించారు. కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 50 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. జనవరి 2న మంత్రివర్గ సమావేశంలో శాఖల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. 15 వేల నుంచి 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే టెట్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 10,961 ఖాళీలున్నట్లు అధికారులు హైకోర్టుకు తెలిపారు.
7,500 వరకు స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఇతర గురుకులాలతో కలుపుకుని మొత్తం 15 వేల నుంచి 20 వేల వరకు ఖాళీలున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టులన్నింటికీ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఉద్యమం సందర్భంగా వేలాది వినతి పత్రాలు వచ్చాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.