చక్రి ఆస్తివివాదం: విల్లా వద్ద విద్యావతి దీక్ష, కోడలిపై పరోక్ష ఆరోపణ
హైదరాబాద్: తెలుగు సినీ సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతోంది. చక్రి మరణించి ఏడాదిన్నర గడిచినా ఆయన కుటుంబం ఆస్తుల వివాదంతో వార్తలకు ఎక్కుతూనే ఉంది. తాజాగా మంగళవారం చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగారు.
హైదరాబాదులోని సోమాజిగుడాలో గల వరుణ్ సర్గం విల్లా వద్ద వారిద్దరు ధర్నాకు దిగారు. విల్లాలో అద్దెకు ఉంటున్న మాధవి అనే మహిళ ఇల్లు ఖాళీ చేయడం లేదని ఆరోపిస్తూ వారు ధర్నాకు దిగారు. ఆమె ఖాళీ చేయకపోవడం వెనక చక్రి భార్య ప్రమేయం ఉండవచ్చునని చక్రి తల్లి, సోదరుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తులు అమ్ముకుని చక్రి భార్య అమెరికా వెళ్లిందని చక్రి సోదరుడు చెప్పారు. మాధవి మాత్రం గత 8 నెలలుగా అద్దె చెల్లించకుండా, విల్లా ఖాళీ చేయకుండా తమను వేధిస్తోందని విద్యావతి ఆరోపించారు. ఖాళీ చేయాలని అడిగామని, లీగల్ నోటీసులు కూడా పంపించామని, అయినా మాధవి సమాధానం ఇవ్వడం లేదని చక్రి తల్లి, సోదరుడు ఆరోపించారు.
ప్రస్తుతం ఆ ఫ్లాట్పై ఉన్న రుణం కూడా తామే చెల్లిస్తున్నామని వారు చెప్పారు. తాము ఫోన్ చేస్తే మాధవి పలకడం లేదని, తమ నెంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టిందని, దాంతో తాము మెసేజ్లు పంపుతున్నామని వారు చెప్పారు. ఫ్లాట్ ధర కోటి నుంచి కోటీ 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఫ్లాట్లోని సామాన్లు కూడా తమవేనని వారు చెప్పారు.
ఫ్లాట్ను 22 వేల రూపాయలకు అద్దెకు ఇచ్చామని, ఏటేటా పది శాతం పెంచాలని కూడా ఒప్పందం ఉందని వారు చెప్పారు. అద్దె ఇవ్వకుండా తమను మాధవి ఇబ్బందులకు గురి చేస్తోందని వారు చెప్పారు.
కొడుకు ఆస్తి తనకే రావాలని తల్లి విద్యావతి కోరుతున్నారు. కాగా చక్రి ఆస్తి తనకే చెందాలని భార్య శ్రావణి అంటున్నారు. ఈ వివాదంపై జూబ్లీహిల్స్ పీఎస్లో విద్యావతి, శ్రావణిలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని వరుణ్ సర్గం విల్లా అపార్ట్మెంట్ ముందు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్లు ధర్నాకు దిగారు.