Big Controversy : సెన్సిటివ్ ఇష్యూని టచ్ చేసిన పూరి.... సోషల్ మీడియాలో అగ్గి దుమారం...
ఇటీవల కరోనా లాక్ డౌన్లో వలస కూలీల వ్యథలను చూసి చలించిన ఆదేశ్ రవి అనే కవి 'పేదరికం కంటే పెద్ద రోగముందా..' అంటూ తన పాటలో సమాజాన్ని ప్రశ్నించాడు. అప్పుడెప్పుడో ప్రజా కవి గోరటి వెంకన్న... ' బాంచోళ్లని బంధమేసి శూద్రులని ముద్రవేసి.. మన తాతల తండ్రుల నుంచి మన బతుకుల మంటల కలిపి... పైకొచ్చిన పెద్దరీకమిది పడగెత్తి బుసకొడుతున్నది..' అంటూ ప్రతిభ అని విర్రవీగేవాళ్లకు పాటతోనే చెంప పెట్టు లాంటి సమాధానమిచ్చాడు. అయితే ఎంతమంది ఎంతగా నిగ్గదీసినా... ఎన్ని సమాధానాలిచ్చినా... మన దేశంలో కులం,పేదరికం అనే చర్చ మొదలుపెడితే ముగిసేది కాదు. ఇప్పుడీ చర్చను దర్శకుడు పూరి జగన్నాథ్ మరోసారి తెరపైకి తెచ్చాడు. అగస్టు 15 స్వాతంత్య దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్ చానెల్లో పూరి పోస్టు చేసిన వీడియో ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది.
కరోనా మరణాలకు సీఎం కేసీఆరే కారణం: భట్టి విక్రమార్క నిప్పులు
పూరి ఏమంటున్నారు...
'మన దేశంలో చాలామందికి ఉచిత పథకాలు తీసుకుని పేదోడిగా బతకడం అలవాటైంది. ప్రభుత్వం కూడా లెక్క లేనంత సాయం చేయడం సరికాదు. చిన్నచిన్న మార్పులు రావాలి. వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలి. నీ జీవితమే నీకు బరువుగా ఉన్నప్పుడు ఒక లీడర్ జీవితం నీ చేతిలో ఎలా పెట్టమంటావని అడగాలి. నీకు రేషన్ సౌకర్యం కావాలంటే నీవు ఓటు కోల్పోతావని చెప్పాలి. అప్పుడు ఏది అవసరమో ఆలోచించుకుని.. నిజంగా కష్టాల్లో ఉన్నవాడే కార్డు తీసుకుంటాడు. ఓటు హక్కు కావాలనుకున్నవాడు జీవితంలో ఇంకా ఎక్కువ కష్టపడుతాడు. ఓటు లేకపోతే సారా ప్యాకెట్లు లేవు. సారా ప్యాకెట్తో ఎన్నికలను డిసైడ్ చేసే బ్యాచ్ ఎన్నికలకు ముందే కట్ అయిపోతుంది. లేకపోతే మన నాయకుల జీవితాలు తాగుబోతులచేతిలో ఉంటాయి.' అని పూరి జగన్నాథ్ తన యూట్యూబ్లో పోస్టు చేసిన ఆడియోలో అభిప్రాయపడ్డారు.
పూరి ఇంకా ఏమంటున్నారు...
'పేద పిల్లలందరికీ కనీస విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఉన్నత విద్య కావాలంటే రుణమిచ్చి తిరిగి చెల్లించమనాలి. ఉద్యోగం చేసి అప్పు తీర్చాలి. అది అప్పు అని తెలిస్తేనే విద్యార్థులు ఒళ్లు దగ్గర పెట్టుకుని చదువుతారు. రిజర్వేషన్లు కులాలను బట్టి గాక పేదవాడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలి. వైట్ రేషన్ కార్డు తిరిగిచ్చిన రోజునే ఓటు హక్కు ఇవ్వాలి. బూత్లో ఓటేసే ప్రతీ ఇండియన్ వ్యక్తిగతంగా స్ట్రాంగ్గా ఉండాలి. నిరక్షరాస్యులకు ఓటు హక్కు ఉండకూడదు. కనీస విద్యార్హత మెట్రిక్యులేషన్గా నిర్ణయించాలి.
అలా అయితేనే ప్రపంచాన్ని,నాయకులను అడుక్కోవడం మానేస్తాం. ప్రపంచంలో ఏ జంతువు మరో జంతువు ముందు చేయి చాచదు. తిండి కోసం కష్టపడుతుంది లేదా చస్తుంది. నీ జాతిని కించపరిస్తే నీకు కోపమొస్తుంది కదా... అలాంటప్పుడు అదే జాతిని కించపరుస్తూ ప్రభుత్వం ముందు పేదోడిలా నిలుచోవడం తప్పు కదా. కష్టపడు... నీ జాతి తలెత్తుకునేలా చెయ్యి... మా జాతికి వద్దు వేరే జాతికి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పిన రోజే భారత్ మారుద్ది. మనం చేయి చాచవద్దు,ఇజ్జత్ కా సవాల్...' అంటూ ఆవేశంగా ముగించాడు పూరి. చివరలో ఒక బూతు మాట కూడా వాడి దమ్ము లేని వాడే పేదోడిగా మిగిలిపోతాడని తీర్మానించేశాడు.
'కులం'పై పూరికి ప్రశ్నలు...
ఇవన్నీ పూరి తన జనగణమణ సినిమా కోసం రాసుకున్న సంభాషణలో.. లేక కేవలం తన అభిప్రాయాలుగా వెలిబుచ్చాడో స్పష్టత లేదు. అయితే పలువురు మేదావులు,రచయితలు,ప్రజా సంఘాల నాయకుల నుంచి మాత్రం పూరి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షులు జిలుకర శ్రీనివాస్ పూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 'పూరి జగన్నాథ్ ఒక నాసిరకం దర్శకుడు. ఆయనేమీ సోషియాలజిస్ట్ కాదు. కనీసం సెకండ్ గ్రేడ్ ఇంటలెక్చువల్ కూడా కాదు. ఆయన కులమే గనుక ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వకపోయి ఉంటే ఈ పూరి డైరెక్టర్ అయ్యేవాడేనా... కులాన్ని బాగా వాడుకుని ఎదిగినవాళ్లే ఇతరులను వేస్టు గాళ్లని నిందిస్తారు. చదువుకున్న వాళ్లకే ఓటు హక్కు ఇవ్వాలని గాంధీ అంటున్నాడు.
చదువులేని వాళ్ల వల్లే దేశం వెనుకబడిపోయిందని పూరీ అంటున్నాడు. కేవలం మూడు కులాలకే చదువుకునే హక్కునిచ్చి... ఇతర కులాలకు చదువుకునే హక్కు లేకుండా చేసి... వాళ్లందరినీ నిరక్షరాస్యులను చేసిన వాళ్లదా తప్పు... నిరక్షరాస్యులదా... చదువుకున్నవాళ్ల వల్లే దేశం బాగుపడుతది అంటే... మరి 2 వేల సంవత్సరాలుగా మీరే కదా చదువుకున్నది.. మా బతుకులను ఎందుకు నాశనం చేశారని అంబేడ్కర్ అడిగిన ప్రశ్నకు గాంధీ సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడు పూరి అసలే చెప్పలేడు. మార్కెట్ భాష,మార్కెట్ కాన్సెప్టులు,ఫ్యూడల్ స్టేట్మెంట్స్,అంతా కాక్టెయిల్ లాంటి నిషా మాటలు..' అంటూ జిలుకర శ్రీనివాస్ పూరి వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
పేదలను అంచనా వేయడంలో విఫలమయ్యారా...?
పూరి వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ కూడా తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఖండించారు. తెల్ల రేషన్ కార్డుకు ఓటు హక్కుకు ముడిపెట్టి పూరి ఎలా మాట్లాడుతున్నారో... తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఓటు హక్కు తీసేయాలని ఏవిధంగా కంక్లూజన్కి వచ్చారో అర్థం కావట్లేదన్నారు. ఈ దేశంలో ఉన్న పేదలను అంచనా వేయడంలో ఆయన విఫలమవుతున్నారా అని ప్రశ్నించారు. దేశంలో పేదరికమంతా పోయి కేవలం ఫ్యాషన్ కోసం రేషన్ కార్డు తీసుకుంటున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఓటును అమ్ముకుంటున్నారన్న కాన్సెప్టును రేషన్ కార్డుకు ముడిపెట్టడం విచారకరమన్నారు. ఈ దేశంలో సంపన్నులు ఎంతమంది,మధ్య తరగతి ఎంతమంది,పేదలు ఎంతమంది అన్న లెక్కలు అసలు పూరి చూశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల్లో లోటు పాట్లు ఉండవచ్చు... కానీ దానికి రేషన్ కార్డుకు,ఓటు హక్కుకు ముడిపెట్టడం బాధాకరమన్నారు.
కులం ఒక వాస్తవం...
'అన్ని కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారు. నిజమే... కానీ రిజర్వేషన్ల అసలు ఉద్దేశమేంటన్నది పూరి ఎప్పుడైనా ఆలోచించారా... ఎందుకు అప్పట్లో అంబేడ్కర్ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నాడు.. దానిపై కనీసం ఎప్పుడైనా రీసెర్చ్ చేశారా... రిజర్వేషన్ అంటే పూరి దృష్టిలో అడుక్కోవడం. మరి ఈ అడుక్కునే పరిస్థితి కల్పించింది ఎవరు... కానీ ఇదే రిజర్వేషన్ లేకపోతే బడుగు,బలహీన వర్గాలకు చెందినవారు విద్యా,వైద్య,ఉపాధి రంగంలో ఎలా ముందుకొస్తారు. చిన్నప్పటినుంచి ఏరోజుకారోజు తినడానికే కష్టమవుతున్న రోజుల్లో ఒక మంచి చదువు ఎలా దొరుకుతుందని ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నారు. చదువు,ఉద్యోగమంటే ఆయనకు చాలా సింపుల్గా కనబడుతున్నది. ఈమాత్రం రిజర్వేషన్లు కూడా లేకపోతే బడుగు,బలహీన కులాల వాళ్లు అసెంబ్లీ గేట్ దాటేవాళ్లా... భారత్లో కులం అనేది ఒక వాస్తవం.కులం లేకుండా కుల ప్రస్తావన లేకుండా కుల సమీకరణాలు లేకుండా భారతదేశ రాజకీయాలు,పరిపాలన జరగదన్న బేసిక్ విషయాలను పూరి ఎలా మరిచిపోతున్నారు.' అని పూరిని ప్రశ్నించారు జర్నలిస్టు కృష్ణ.
Recommended Video
సోషల్ మీడియాలో అగ్గి దుమారం...
పూరి తాజా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు రచయితలు,ప్రజాస్వామిక వాదులు ఖండిస్తున్నారు. అయితే పూరి వ్యాఖ్యలను సమర్థించేవారు లేరా అంటే.. ఆయన వీడియో కామెంట్ సెక్షన్లో ఆయన్ను సమర్థించేవారు కూడా చాలామందే ఉన్నారు. అలానే విబేధించేవారూ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మీ సినిమాలు చూడటం మానేస్తే ఏంటి సంగతి అని ఎదురు ప్రశ్నిస్తున్నవారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఓ అంతు లేని చర్చకు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో అగ్గి రాజేశారు.