అఖిలేశ్-కేటీఆర్ సరదా సంభాషణ: 'మా దగ్గర వంటల్లో కారం ఎక్కువ'..
Recommended Video
హైదరాబాద్: దేశ సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆయన్ను కలవడం.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడం జరిగింది.
అఖిలేశ్ రాకవేళ.. ఆయన కోసం పసందైన విందు ఏర్పాటు చేశారు కేసీఆర్. బేగంపేట విమానశ్రయం నుంచి ఆయన నేరుగా ప్రగతి భవన్ కు చేరుకోగా.. కేసీఆర్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి మధ్యాహ్నా భోజనం చేశారు. వీరితో పాటు కేటీఆర్ మరికొంతమంది మంత్రులు కూడా విందులో పాల్గొన్నారు.
విందులో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల కూర వంటి మాంసాహార వంటకాలతో పాటు పప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ, రోటీ, తెల్లన్నం వంటి పదార్థాలు అఖిలేష్ కు వడ్డించినట్టు సమాచారం.
కాగా, విందు సమయంలో అఖిలేశ్-కేటీఆర్ ల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విందులో వడ్డించిన వంటల గురించి చెబుతూ.. 'మా దగ్గర కూరల్లో కారం కాస్త ఎక్కువగా ఉంటుంది' అని అఖిలేశ్ తో అన్నారట కేటీఆర్. దీనికి అఖిలేశ్.. 'అంత కారంగా ఏమి లేవు.. వంటలు బాగున్నాయి' అని బదులిచ్చారట. మొత్తం మీద విందు సమయంలో ఇద్దరి మధ్య సరదా సరదా సంభాషణ సాగిందంటున్నారు.
ఇకపోతే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంటుకు తన పూర్తి మద్దతు ఉంటుందని అఖిలేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం అఖిలేశ్కు సీఎం కేసీఆర్ కృష్ణుడి ప్రతిమను అందజేశారు. సాయంత్రం అఖిలేశ్ మంత్రి తలసాని నివాసంలో తేనిటి విందుకు హాజరయ్యారు. తలసాని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.