'ఏదో ఊహించుకోలేదు': డీకె అరుణ-టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర సంభాషణ..
తానేదో ఊహించుకుని పార్టీలోకి వెళ్లలేదని, సంతోషంగానే ఉన్నానని బదులిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ లోపలెంత వాడి వేడిగా చర్చకు దిగినా.. బయటకు రాగానే నవ్వుతూ కౌంటర్స్ వేసుకుంటున్నారు నేతలు.
గురువారం అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ నేత డీకె అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. భాస్కర రావు తనకు ఎదురుపడటంతో.. 'మీరు టీఆర్ఎస్లోకి వెళ్తే మీ కార్యకర్తలు మా పార్టీకి వస్తున్నారు. ఏదో అనుకుని వెళ్లారు.. మీరు కూడా వచ్చేయండి' అంటూ డీకె అరుణ వ్యాఖ్యానించారు.
డీకె అరుణ వ్యాఖ్యలపై భాస్కరరావు కూడా సున్నితంగానే స్పందించారు. తానేదో ఊహించుకుని పార్టీలోకి వెళ్లలేదని, సంతోషంగానే ఉన్నానని బదులిచ్చారు.
ఆ హామిలు ఏమయ్యాయి: ఎమ్మెల్యే సంపత్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన నియోజకవర్గంలో ఇచ్చిన హామిల గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. జోగులాంబ దేవాలయం ఆధునీకరణ, వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీ, రైస్ డిపో, ఆర్అండ్బీ రోడ్స్ వంటి హామిల్లో ఒక్కటి కూడా ఇంతవరకు ముందుకు కదల్లేదంటే దానర్థమేంటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
సంపత్ కుమార్ ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. సంపత్ చెప్పిన ప్రతీ ప్రశ్నను నోట్ చేసుకుంటున్నామని, ఆయన ప్రస్తావించిన అంశాలన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు.