నిర్భయ హంతకులకు ఉరిశిక్ష పడిందా?:చట్టాలు మారిస్తే బతుకులు బాగుపడవు: మోడీకి కేటీఆర్ ట్వీట్లు
హైదరాబాద్: వెటర్నరి డాక్టర్ దారుణ అత్యాచారానికి, హత్యకు గురైన నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి వరుసగా ట్వీట్లను సంధించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో సమూల మార్పులు చేస్తే గానీ సమాజంలో మార్పు రాదని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాల్లో మార్పులను తీసుకుని వచ్చే దిశగా దృష్టి సారించాలని చెప్పారు.
Mahesh Babu: ఇలాంటి ఘాతుకాల్లో మరణశిక్ష పడాల్సిందే: మహేష్ బాబు డిమాండ్: కేంద్రానికి, కేటీఆర్ కు..!
ఉరి తీయాలంటూ డిమాండ్లు వినిపిస్తుండటంతో..
తెలంగాణలోని శంషాబాద్ సమీపంలో వెటర్నరి డాక్టర్ దారుణంగా హత్యకు గురైన తరువాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాల అనంతరం కేటీఆర్.. ప్రధానమంత్రికి ట్వీట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెటర్నరి డాక్టర్ ను హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వారిని బహిరంగంగా ఉరి వేయాలని, కాల్చి చంపాలంటూ పౌర సమాజం మండి పడుతోంది.
ఏడేళ్లయినా కూడా నిర్భయ హంతకులకు ఉరి శిక్ష పడలేదు ఎందుకు?
కరడుగట్టిన నేరస్తులు, ఘోర కృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా మన దేశ చట్టాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం మొత్తాన్నీ వణికింపజేసిన నిర్భయ ఉదంతంలో దోషులకు ఇప్పటికైనా మరణశిక్ష పడిందా? అని ఆయన ప్రశ్నించారు. నిర్భయ ఘటన చోటు చేసుకున్న ఏడేళ్ల తరువాత కూడా దోషులకు ఉరి శిక్షను అమలు చేయలేకపోతున్నామని అన్నారు. తొమ్మిది నెలల పసిగుడ్డుపై అత్యాచారానికి పాల్పడిన నేరస్తుడికి దిగువ న్యాయస్థానం ఉరి శిక్షను విధించినప్పటికీ.. హైకోర్టు మాత్రం దీని తీవ్రతను తగ్గించిందని అన్నారు. ఉరి శిక్షను కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని చెప్పారు.
ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు..
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)ల్లో సమూల మార్పులు చేయాల్సిన పరిస్థితిని ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాతావరణం సూచిస్తోందని అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు చేయాలని అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించేలా చట్టాలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాల్లో మార్పుల అంశంపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
నేరానికి పాల్పడి చట్టం నుంచి తప్పించుకునేలా
తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు కూడా చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితులను రూపుమాపాలని అన్నారు. నేరానికి పాల్పడితే.. కఠిన శిక్ష పడుతుందనే భయం కలిగేలా చట్టాలు ఉండాలని చెప్పారు. మానవ మృగాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మనం అందరం సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమకు న్యాయం జరగదనే ఆందోళనలో ఉన్న కోట్లాదిమంది ప్రజల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని, చట్టసభల్లో న్యాయపరమైన అంశాలపై చర్చించాలని కోరుతున్నానని కేటీఆర్ అన్నారు.
పున: సమీక్షకు వెళ్లే అవకాశమే లేకుండా..
మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి న్యాయస్థానం విధించే మరణ శిక్షే చివరిది కావాలని, దీనిపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ కు గానీ, పున: సమీక్షకు గానీ అవకాశం కల్పించకూడదని కేటీఆర్ అన్నారు. ఆ రకంగా ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు చేయాలని కేటీఆర్ సూచించారు. చట్టాల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని, న్యాయాన్ని అందించడంలో జాప్యం చేస్తే.. న్యాయాన్ని అందించి కూడా ఉపయోగం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు.