డ్రంక్ అండ్ డ్రైవ్లో రచ్చ చేసిన మహిళ: చివరకు స్టేషన్కు తరలించారు
హైదరాబాద్: మద్యం మత్తులో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, నగరంలోని జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మహిళ రచ్చ చేసింది. కారు నంబర్ ప్లేట్పై జిల్లా రెవెన్యూ అధికారి అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన మహిళ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు సహకరించకుండా పోలీసులను గంటకుపైగా ఇబ్బంది పెట్టింది. అంతేగాక, పోలీసులతో దురుసుగా ప్రవర్తించి.. తాను ఐఏఎస్ అధికారి కూతురినంటూ బెదిరించింది. తనకు తెలిసిన వాళ్లతో ఫోన్లు చేయించేందుకు ప్రయత్నించింది.
అయితే, ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపు సర్దిచెప్పినా వినకపోవడంతో చివరికి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆమెను పోలీసుస్టేషన్కు తరలించారు. ఆమె వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆమె వాహనం వాస్తవంగానే జిల్లా రెవెన్యూ అధికారిదేనా? అనే కోణంలో ట్రాఫిక్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామెన్తో కూడా ఆ మహిళ వాగ్వాదానికి దిగడం గమనార్హం.
శుక్రవారం రాత్రి 6 చోట్ల తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన 123 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాలు స్వాధీనం చేసుకుని, చాలన్లు రాసిచ్చారు.