దొంగ కడుపులో బంగారు గొలుసు: బయటకు వచ్చేవరకు వెయిటింగ్?
హైదరాబాద్: ఓ దొంగ రెండు రోజుల క్రితం ఓ బంగారు గొలుసును దొంగిలించి పోలీసులను చూసి మింగేశాడు. అప్పటి నుంచి పోలీసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. బంగారం గొలుసును మింగేసిన వికాస్ అనే 22 ఏళ్ల దొంగను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అతని కడుపులోంచి గొలుసు ఎప్పుడు బయకు వస్తుందా అని పోలీసులు, గాంధీ ఆస్పత్రి వైద్యులు, వృద్ధ దంపతులు కళ్లకు వత్తులు వేసుకుని చూస్తున్నారు.
బంగారు గొలుసును దొంగిలించిన వికాస్ను రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి పట్టుకున్నారు. పోలీసులను చూసి గొలుసును వికాస్ మింగేశాడు. ద్రవాలు, అరటిపళ్లు ఇచ్చి వికాస్ కడుపులోంచి గొలుసు బయటకు తీయడానికి పోలీసులు గాంధీ ఆస్పత్రి వైద్యుల సహకారంతో ప్రయత్నిస్తున్నారు.
నాలుగు తులాల బంగారం గొలుసు అతని కడుపులోంచి బయటకు రావాల్సి ఉంది. సికింద్రాబాదులోని వారాసిగుడాకు చెందిన వికాస్ సితాఫల్మండిలో సాయంత్రం వాకింగ్కు భర్త శంకరయ్యతో కలిసి వెళ్లిన ప్రీమలమ్మ గొలుసును అతను దొంగిలించాడు.
దాంతో మైలారుగడ్డకు చెందిన ఆ దంపతులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుతుండగా చిలకలగుడా పోలీసులు వికాస్ను పట్టుకున్నారు. దొంగిలించిన మంగళసూత్రం, బంగారం గొలుసు వికాస్ చొక్కా జేబులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వికాస్ గొలుసును మింగేశాడు.
చిలకలగుడా పోలీసులు వికాస్ను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు వికాస్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు స్కాన్ చేయగా, గొలుసు వికాస్ కడుపులో ఉన్నట్లు తేలింది. వికాస్ చిన్నప్రేవులో గొలుసు ఉన్నట్లు వైద్యులు పోలీసులకు సర్టిఫికెట్ ఇచ్చారు.
వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్తో పోలీసులు వికాస్ను ఆదివారం సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కడుపులోంచి గొలుసును తీయడానికి వికాస్ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నుంచి వికాస్కు ద్రవపదార్థాలు, అరటిపండ్లు ఇస్తూ గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందా అని పోలీసులు ఎదురు చూస్తున్నారు.
సోమవారం రాత్రి వరకు కూడా గొలుసు బయటకు రాలేదు. ఓ రోజులో గొలుసు సహజమైన రీతిలో బయటకు రాకపోతే శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెబుతున్నారు.