Corona నెగిటివ్: గాంధీ ఆస్పత్రి నుంచి ఆ యువకుడు డిశ్చార్జ్
హైదరాబాద్: కరోనావైరస్ సోకి గాంధీ ఆస్పత్రి పొందుతున్న యువకుడు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. దుబాయ్ నుంచి వచ్చిన అతనికి కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, అతనికి కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
హైదరాబాద్ మహేంద్ర హిల్స్కు చెందిన యువకుడు మార్చి 1న కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి 13 రోజులుగా గాంధీ ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకున్నాడు. తాజాగా, కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు అతడ్ని డిశ్చార్జ్ చేశారు.
ఇంటివద్దనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. ఆ యువకుడు కరోనా బారి నుంచి తప్పించుకోవడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో రెండో మరణం..
కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఢిల్లీలో 69ఏళ్ల ఓ మహిళ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఢిల్లీలోని జనక్పురి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సమాచారం. దేశంలో ఇది రెండో కరోనా మరణమని హెల్త్ సెక్రటరీ ప్రీతి సుదాన్ ప్రకటించారు.
మృతి చెందిన మహిళ, ఆమె కుమారుడు ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారిద్దరికీ పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో మార్చి 7న ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు.
సదరు మహిళకు అప్పటికే డయాబెటిస్, హైపర్టెన్షన్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మార్చి 9 నుంచి మహిళ ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, అప్పట్నుంచి వెంటిలేటర్పై చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మరింతగా ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.