కరోనా అలర్ట్: హైదరాబాద్లో మూడు అనుమానిత కేసులు, ఆస్పత్రులకు తరలింపు..
కరోనా వైరస్ అనుమానిత కేసులు హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వస్తోన్న వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు. వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్తో తీసుకొచ్చారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న వ్యక్తిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన తర్వాత.. మరో మూడు అనుమానిత కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video
మరో 3 వైరాలజీ ల్యాబ్లు..
విదేశాల నుంచి వస్తోన్న వారి వల్ల వైరస్ ప్రబలుతుండటంతో.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్, స్కానింగ్ పకడ్బందీగా చేస్తున్నారు. ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేశాక.. అనుమానం లేకుంటే వారి వారి స్వస్ధలాలకు పంపిస్తున్నారు. లేదంటే నేరుగా ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రులతోపాటు మరో మూడుచోట్ల వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేశారు.
సౌదీ ప్రయాణికుడికి..
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను థర్మో స్కాన్ చేస్తున్నారు. పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే.. 108 అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నారు. సౌదీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అతనిని అంబులెన్స్లోకి తీసుకొచ్చి.. నేరుగా ఆస్పత్రికి తరలించారు. వైరస్ ప్రబలుతుండటంతో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన నాలుగు అంతర్జాతీయ విమానాలను రద్దుచేశారు.
విమానాలు రద్దు..
కరోనా వైరస్ను ప్రభుత్వం ఎదుర్కొంటుందని.. అయితే ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని చెప్పారు. బుధవారం జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరు, దుబాయ్ నుంచి వచ్చిన ఒకరికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేయగా.. కరోనా లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. వారిని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలించామని తెలిపారు. దీంతో కుటైవ్ వెళ్లాల్సిన రెండు విమానాలు, మస్కట్ వెళ్లాల్సిన విమానం, కువైట్ నుంచి రావాల్సిన విమాన సర్వీసును రద్దుచేశామని పేర్కొన్నారు.
100 శాంపిల్స్ సేకరణ..
సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళ, కరీంనగర్కి చెందని ఓ వ్యక్తి, యువకుడు ఫీవర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో 9 మంది అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది శాంపిల్స్ సేకరించగా.. 8 మందికి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన యువతికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాంధీ, ఉస్మానియాతోపాటు ఫీవర్, ఐపీఎం, కాకతీయ మెడికల్ కాలేజీలో మరో 3 వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ చోట 100 శాంపిల్స్ పరీక్షించే వెసులుబాటు ఉన్నది. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసర మందులు, పరికరాల కొనుగోళ్ల కోసం రూ.28.43 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.