రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా.!కుండపోతగా కురుస్తున్న వర్షాలే కారణమా.?
హైదరాబాద్/అమరావతి : రుతువులు మారాయి. వాతావరణం మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు విషమంగా తయారయ్యాయి. వర్షాకాలంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్పినట్టే జరుగుతోంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అందుకు అనుగుణంగా కరోనా వైరస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది. తమ గ్రామానికి, తమ వీధికి కరోనా రాదని ధీమా వ్యక్తం చేసిన కొంతమందిని విస్మయానికి గురిచేస్తూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది కరోనా వైరస్. దీంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అగమ్య గోచరంలో పడిపోయినట్టు తెలుస్తోంది. పెరుగుతున్న వర్షాలు కూడా కరోనా వ్యాప్తికి దోహద పడుతున్నట్టు స్పష్టమవుతోంది.
Recommended Video
విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు రెండు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారం వుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెదర్ బులెటిన్ విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జులై 14 సాయంత్రం నుంచి 17వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావం వుంటుందని వాతావరణ శాఖాధికారులు అంఛనా వేస్తున్నారు. దీనిప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం చేసారు. ఇలా కురుస్తున్న వర్షాలే కరోనా విజృంభణకు కారణమనే చర్చ కూడా జరుగుతోంది.
ఆందోళన చెందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. తెలుగు ప్రజలపై పంజా విసురుతున్న కరోనా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకూ వేలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ సామాన్యులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నటులు, వైద్యులు, పోలీసుల కూడా ఈ వైరస్ బారిన పడుతుండంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో హైదరాబాద్లోని అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను అత్యంత ప్రమాదకర జోన్లుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
రికార్డు స్థాయిలో వర్షపాతం.. అంతే ధీటుగా నమోదవుతున్న కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు. ప్రస్తుతం 16,621 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుదవారం తాజాగా 2,432 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే బుధవారం ఒక్క రోజే 44 మంది మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది.
వర్షాకాలం కరోనా విజృంభిస్తుందన్న వైద్యులు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..
దీంతో దేశం మొత్తం వ్యవహారం వదిలేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉదృతికి ప్రజలు బెంబేలెత్తి పోతున్నట్టు తెలుస్తోంది. వర్షాకాలంలో కరోనా విజృంభిస్తుందంటే అంతగా పట్టించుకోని ప్రజానికం ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎండాకాలంలో సమూహాలుగా ఏర్పడి, మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు శిక్షఅనుభవించాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సీన్ రావడానికి ఎంత కాలం పడుతుందో స్పష్టత లేదు కాబట్టి జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనాకు తోడు వర్షాలు కూడా విస్తరాంగా కురుస్తుండడంతో రెంగు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతుందనే చర్చ జరుగుతోంది.