కరోనా జాగ్రత్తలు ... అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ.. అలెర్ట్ గా తెలంగాణా
కరోనా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది . ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు రెగ్యులేట్ చేయాలని సూచించింది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. శాఖ వారీగా అధికారులకు ఆరోగ్య రక్షణా చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు .
కొడుక్కి కరోనా పాజిటివ్ అని తెలిసినా రైల్వే గెస్ట్ హౌస్ లో దాచిన తల్లి .. ఉద్యోగం నుండి సస్పెన్షన్
కరోనా జాగ్రత్తలపై లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఇక కేంద్ర ఆరోగ్య శాఖ రాసిన లేఖలో కరోనాపై ప్రజల్ని చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని పేర్కొంది . జనసమూహాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది . ప్రైవేట్ సంస్థలు వర్క్ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదివారం ప్రజలంతా ఇంటి వద్దే కర్ఫ్యూలో పాల్గొనాలని తెలిపింది. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తెలంగాణాలో కరోనా నియంత్రణకు రంగంలోకి దిగిన మంత్రులు
ఇక తెలంగాణా రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యటమే కాదు ఎక్కడికక్కడ శాఖల వారీగా సమీక్షలు జరిపి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు తెలంగాణా మంత్రులు . అంగన్వాడీ కేంద్రాల్లో కరోనావైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
శుభ్రత పాటించాలని,ప్రభుత్వానికి సహకరించాలన్న మంత్రులు సత్యవతి , శ్రీనివాస్ యాదవ్ లు
శానిటైజర్లను అందుబాటులో ఉంచటం , వ్యక్తిగత పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవటం మంచిదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు . కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం కావాలన్నారు . ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దన్నారు. వృద్దులు, చిన్నారులు ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.
విదేశాల నుండి వచ్చిన వారికే కరోనా ..తెలంగాణలో ఉన్నవాళ్లకు రాలేదన్న ఈటెల
ఇక ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. ఇటలీ లాంటి దేశాల్లో పరిస్థితులను చూసి అందరూ అర్థం చేసుకోవాలని, ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నవాళ్లకు కరోనా రాలేదని, విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వచ్చిందని చెప్పిన ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.