ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా?: సర్కారుపై హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనానికి నివేదికను సమర్పించింది.
పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా?
ఈ క్రమంలో జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీ తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. పబ్బులు, మద్యం షాపులపై కరోనా ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయండి..
అంతేగాక, వంద మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రతీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని స్పష్టం చేసింది. కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. లాక్డౌన్ లేకపోయినా.. కనీసం కంటైన్మెంట్ జోన్లు అయినా ఉండాలని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీని కోసం నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే.. ఇంకెప్పుడు స్పందిస్తారు?
రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నం లోగా నివేదించాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని, మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణలో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చర్యలపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.