ఢిల్లీ వెళ్లి వచ్చి..: తెలంగాణలో 6కు చేరిన కరోనా మరణాలు
హైదరాబాద్: కరోనావైరస్ బారిన పడి తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ తాజాగా వెల్లడించిన బులెటిన్లో పేర్కొంది. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు.
ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.
Recommended Video
కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిసంఖ్య 77కు చేరింది. కాగా, కరోనా నుంచి కోలుకుని మొత్తం 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61గా ఉంది. కాగా, కరీంనగర్లో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ శశాంక వెల్లడించారు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన కొంతమంది కరీంనగర్కు వచ్చిన విషయం తెలిసిందే. వారందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారితో తిరిగిన వ్యక్తికి కూడా గతంలో పాజిటివ్ వచ్చింది.