covid-19: 31 వరకు తెలంగాణలో అన్నీ బంద్, కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాలు, మంచిర్యాల వ్యక్తికి కరోనా
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) మనదేశంలో కూడా వేగంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చర్యలకు ఉపక్రమించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు శనివారం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ కీలక నిర్ణయాలను తీసుకుంది.
31 వరకు బంద్
దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించిన కమిటీ.. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర సర్కారు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థలను మార్చి 31 వరకు మూసివేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో వివివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
శాసనసభ సమావేశాల కుదింపు..
అలాగే, శాసనసభ బడ్జెట్ సమావేశాలను కూడా కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా పరిస్థితులు నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలను నిర్వహించాలని, సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నట్లు సమాచారం.
మంచిర్యాల వ్యక్తికి కరోనా..
తెలంగాణలో రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేపింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం అతడు ఇటలీ నుంచి రావడం గమనార్హం. వచ్చిన నాటి నుంచి ఆ వ్యక్తికి జలుబు, దగ్గు, జ్వరం ఉంది. దీంతో అతడ్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడికి రక్త నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్ధారిస్తామని వైద్యులు తెలిపారు.
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. 83కు చేరిక
కాగా, మనదేశంలో ఇప్పటి వరకు 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా థియేటర్లు, మాల్స్ కూడా బంద్ చేశారు. ఇప్పటి వరకు దేశంలో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5500 మందికిపైగా మరణించారు. లక్ష50వేల మందికిపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.