షడ్రుచుల ఉగాది..కరోనా ప్రభావంతో చేదుగా..శార్వరిని ఆహ్వానిద్దాం ధైర్యంగా!!
కొత్త ఆశలు, కొంగొత్త లక్ష్యాలతో తెలుగువారి నూతన సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని చాలా ఆశగా ఎదురు చూసిన ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరోనా చేదు అనుభవాన్ని అందించింది. షడ్రుచుల ఉగాది ఈసారి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరోనా వల్ల చేదు రుచితో మొదలు కానుంది. ఏదేమైనా శ్రీ శార్వరి నామ ఉగాది తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు అనుభవంగా మొదలైనా , కరోనా నివారణ జరిగి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండి తీపి జ్ఞాపకంగా మిగలాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోలేని స్థితిలో ఉగాది
శ్రీ శార్వరి నామ ఉగాది మార్చి 25 వ తేదీన తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. తెలుగు వారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారి తొలి పండుగగా భావించేది ఉగాది . ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించాలని, ఈ సంవత్సరమంతా సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మామిడి పూత పరిమళాలతో, కోకిల కిలకిల రావాలతో వసంత రుతువులో స్వాగతిస్తారు. తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది ఈ సారి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పరిస్థితి లేదు.
ఎప్పుడూ లేని విధంగా ఇళ్లకే పరిమితం కానున్న ప్రకృతి పండుగ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరికి వారు ఇంటికి పరిమితమై పండుగను నిర్వహించుకో వలసిన పరిస్థితి. ఆకులు రాలే శిశిరానికి వీడ్కోలు పలికి వసంత రుతువును ఆహ్వానిస్తూ జరుపుకునే ఉగాది పండుగ వేప పూల పరిమళం తో, చెరుకు గడల తీయదనంతో, మామిడి కాయల పులుపు వగరు మేళవింపుతో షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరూ సేవించి జరుపుకుంటారు. జీవితంలోని కష్టనష్టాలను సుఖదుఃఖాలను అన్నిటినీ సమానంగా చూడాలని సందేశం ఇస్తూ ఉగాది పచ్చడి షడ్రుచుల మేళవింపుగా తయారుచేస్తారు. అయితే ఈసారి ఉగాది పచ్చడి కరోనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు రుచిని అందించనుంది.
ఉగాది జరుపుకునే విధానం ఇదే
ఇది హిందువుల ఆచారాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, సముచిత ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఉగాది పర్వదినాన అందరూ ఉదయాన్నే లేచి, అభ్యంగన స్నానాలు ఆచరించి, కొత్త బట్టలు ధరించి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మామిడాకులు ఇంటికి తోరణాలు కట్టి, రంగవల్లులతో ఇంటిని తీర్చిదిద్ది వసంత లక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. తమ ఇష్ట దైవాలను పూజిస్తారు .అందరూ కలిసి ఆలయాలకు వెళ్లి అక్కడ పంచాంగ శ్రవణం వింటారు. కవి సమ్మేళనాలలో పాల్గొంటారు . షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని పంచాంగానికి, కాల దేవతకు నివేదన చేసి తమ జీవితాలు సజావుగా సాగాలని కోరుకుంటారు. ఈ సంవత్సరం అంతా వివిధ రాశుల వారికి ఎలా ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పంచాంగంలో తెలుసుకుంటారు .
ఉగాది పచ్చడి సర్వ శ్రేష్టం .. ఆయుర్వేద యుతం
ఇక ఉగాది పచ్చడి వైద్యపరంగానూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అని చెబుతారు. అందుకే మానవ మనుగడకు ప్రతీకగా, ఉగాది పచ్చడి లో నిగూఢమైన అర్థం ఉందని చెబుతారు. అలాంటి ఉగాది పచ్చడి ఆయుర్వేద లక్షణాలు ఉన్న కారణంగా రుతువుల మార్పులతో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని ప్రజల విశ్వాసం . ఇక తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఉగాది పండుగకు ఈ ఏడాది విఘాతం వచ్చింది. కరోనా ప్రభావంతో ఉగాది సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఎక్క డ నిర్వహించకూడదని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఉగాది జాతీయ విపత్తుగా కరోనా ప్రబలుతున్న సమయంలో శార్వరి నామ ఉగాది
శార్వరి నామ తెలుగు సంవత్సరాది మార్చి 25వ తేదీన ఘనంగా జరుపుకోవాల్సి ఉండగా జాతీయ విపత్తుగా కరోనా పరిణమించిన నేపథ్యంలో ఎవరికి వారు ఇళ్లకు పరిమితమై పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు ప్రభుత్వాలు కూడా పండుగ సందడి లేదని , గుంపులు గుంపులుగా బయట తిరగకూడదని చెప్తున్నాయి.గతంలో ఎన్నడూ లేని వింత పరిస్థితి శార్వరి నామ ఉగాదికి వచ్చింది. అయినా ధైర్యంతో శార్వరి సకల శుభాలు చేకూరుస్తుందన్న విశ్వాసంతో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉగాదిని ఘనంగా జరుపుకుందాం. ప్రకృతి పండుగ అయిన ఉగాది ఈ ప్రకృతి విపత్తును ఆపుతుందని , శార్వరి సకల శుభాలు చేకూరుస్తుందని నమ్ముదాం .. శార్వరిని అందరం సాదరంగా ఆహ్వానిద్దాం .