కరోనా ఎఫెక్ట్ .. ఆ గ్రామంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధం .. ఉల్లంఘిస్తే రూ.1000 ఫైన్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతుంది . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531 కి చేరింది . ఇక కరోనా వైరస్ పైన జాగ్రత్తల మాట అటుంచి కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక పక్క రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేస్తే ఇక గ్రామాల ప్రజలు సైతం తమ సరిహద్దులను మూసివేస్తున్నారు.
కరోనా భయంలో గ్రామాలు
కరోనా భయం గ్రామాలను పట్టి పీడిస్తుంది .ఎవరు ఎక్కడికి వెళ్ళినా, వచ్చినా సరే అనుమానంగా చూస్తున్నారు. ఇక ఎవరు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ అన్న భయం ప్రజలను వేధిస్తోంది. ఇక అందుకు తగ్గట్టు రోజురోజుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఇక నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గంగ్యాడ గ్రామానికి చెందిన 14 మందిని గ్రామస్థులు గ్రామంలోకి అనుమతించలేదు .
ఎటైనా వెళ్లి వస్తే గ్రామాల్లోకి అనుమతి నిరాకరణ
విహారయాత్రకు వెళ్లి తిరిగి గ్రామంలోకి వచ్చిన నేపథ్యంలో వారిని గ్రామంలోకి రానివ్వలేదు . గ్రామం విడిచి పెట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించి వచ్చిన వారిని గ్రామస్తులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కరోనా వైరస్ వారికి లేదని నిర్ధారిస్తేనే వారిని గ్రామంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇక ఇదే క్రమంలో చాలా గ్రామాల్లో గ్రామాల్లోకి బయట వారు రాకుండా కంచెలు వేస్తున్నారు. గేట్లు పెడుతున్నారు. ఇక గ్రామంలోని వారు కూడా ఇష్టారాజ్యంగా తరిగి వస్తామంటే ఒప్పుకోమని చెప్తున్నారు .
స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా గ్రామాల సరిహద్దుల మూసివేత
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు దిగుతున్నా భయం గుప్పిట్లో ఉన్న వివిధ గ్రామాల ప్రజలు స్వీయ రక్షణా చర్యలు తీసుకుంటున్నారు. తమ ఊరిలోకి ఎవరూ రావొద్దంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. రోడ్లకు అడ్డంగా గోతులు తీయడం, కంచె వేయడం, ట్రాక్టర్లను అడ్డంగా నిలబెట్టడం వంటి చర్యలతో బయటి వాళ్ళు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు.
ఆ గ్రామంలో ఎంట్రీ .. ఎగ్జిట్ నిషేధం ... ఉల్లంఘిస్తే వెయ్యి జరిమానా
తాజాగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఇతరులు లోనికి రాకుండా ఏకంగా గేట్లు పెట్టారు . ఊరి నుంచి బయటకు వెళ్లకుండా, బయట వాళ్ళు లోపలకు రాకుండా కట్టుబాట్లు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమాన విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామం ముందు ఓ బోర్డు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శి. అయితే ఎవరైనా అత్యవసర పనుల మీద వెళ్ళే గ్రామస్థులు సైతం ఈ తరహా నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరహాలో చాలా గ్రామాల ప్రజలు తమ గ్రామాలలోకి రావద్దని నిషేధం విధించటం గమనార్హం.