ఖరీఫ్ సాగుకు కరోనా గండం ... వ్యవసాయ కూలీలకొరతతో విపరీతంగా కూలీ రేట్లు
కరోనా ఎఫెక్ట్ వానాకాలం సాగుపై పడింది. వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లు వేస్తున్న తరుణంలో రైతులకు కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వలస కూలీలు లేక.. స్ధానిక కూలీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా కూలీ ధరలకు రెక్కలొచ్చాయి. ఏ ఊరి కూలీలు ఆ ఊళ్లోనే పని కల్పించాలని స్ధానికంగా చేస్తున్న తీర్మానాలతో అన్నదాతలపై మరింత భారం పడుతోంది.
Recommended Video
కరోనా పూర్తిగా అంతమయ్యే అవకాశం తక్కువే .. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి సంచలనం
లోకల్ కూలీలకు డిమాండ్.. ఒక్కసారిగా పెరిగిన కూలీ రేట్లు
తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో.. కూలీల కొరత ఏర్పడింది. ఫలితంగా లోకల్ కూలీలకు డిమాండ్ పెరిగింది. వైరస్ తీవ్రత దృష్ట్యా ఏ గ్రామాల్లో ఉన్న కూలీలు ఆ గ్రామాల్లోనే పని చేయాలని స్ధానికంగా నిర్ణయం తీసుకుని తీర్మానాలు చేస్తున్న పరిస్థితి . వ్యవసాయ కూలీలు కూలీ రేట్లు అమాంతంగా పెంచేశారు. మగవారికి రోజు కూలీ 500 నుంచి 600 వరకు పలుకుతుండగా, ఆడవారికి 360 నుంచి 400 వరకు చెల్లిస్తున్నారు.
కరోనా కారణంతో వలస కూలీల కొరత .. స్థానికుల డిమాండ్
ప్రస్తుతం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉదాహరణకు చూస్తే కామారెడ్డి జిల్లా పరిధిలోని.. నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, జుక్కల్ మండలాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వరినాట్లు వేసేందుకు కూలీలు తరలివచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా.. మహారాష్ట్ర వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇతర ప్రాంతాల కూలీలు వచ్చేందుకు భయపడుతున్నారు.
రైతన్నలకు కూలీ రేట్ల అదనపు భారం
దీనికి తోడు కొన్ని గ్రామాల్లో ఏ ఊరి కూలీలు ఆ ఊళ్లో పనులు కల్పించాలని చెబుతుండటం సమస్యకు కారణంగా మారింది. అందరూ రైతులు ఒకేసారి వరినాట్లుకు సిద్దమవుతుండటంతో కూలీల ధరలు విపరీతంగా మారి రైతులకు భారం అయ్యాయి . ఒక ఎకరం వరినాట్లు వేసేందుకు 4వేల నుంచి 4500 తీసుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూలీల రేట్లు పెరగడంతో.. పెట్టుబడి భారం మరింత పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రైతన్నలకు ఆర్ధికంగా నష్టం కలిగిస్తున్న కరోనా
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది కరోనా వల్ల రైతుల పరిస్ధితి. అసలే ఎరువులు- విత్తనాల ధరల పెంపుతో పెట్టుబడి రెట్టింపు అయ్యిందని ఆందోళనలో ఉన్న రైతులకు పెరిగిన కూలీల ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అటు పారిశ్రామిక వర్గాలనే కాదు ఇటు రైతన్నలను వదలకుండా ఇబ్బంది పెడుతుంది. ఆర్ధిక నష్టాలకు గురి చేస్తుంది.