ఈసారి నిరాడంబరంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది తెలంగాణ సర్కారు. రాజధాని హైదరాబాద్ తోపాటు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సంబరంగా నిర్వహించింది.
అయితే, ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం (జూన్ 2) ఉదయం 8.30 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ఈ కార్యక్రమానికి కూడా పరిమిత సంఖ్యలోనే నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించనున్నారు కేసీఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేస్తారు.
కాగా, మంగళవారం మధ్యాహ్నం రాజ్ భవన్లో గోశాలను ప్రారంభించి, మొక్కలు నాటననున్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఇక మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్, విప్లు జెండాలను ఆవిష్కరించనున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2792కి చేరింది. సోమవారం మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82కి చేరింది. కాగా, ఈరోజు నమోదైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనివే కావడం గమనార్హం.
తాజా కేసులతో తెలంగాణలో మొత్తం లోకల్ కేసుల సంఖ్య 2358కి చేరినట్లై వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. వలస కార్మికులు, విదేశీయులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2792కు చేరిందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 1213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.