కరోనా ఎఫెక్ట్ ... రాములోరి కళ్యాణం టీవీల్లోనే... పూజలు ఇళ్లలోనే ..
ఈ రోజు శ్రీరామ నవమి.. లోక కళ్యాణం కోసం వాడవాడలా అట్టహాసంగా సీతారాముల కళ్యాణం జరిపించి ప్రజలంతా కూడి సంతోషంగా జరుపుకునే పండుగ . అలాంటి పండుగ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు . శ్రీరామనవమి వస్తుంది అంటే దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వాడవాడలా రాములోరి కళ్యాణానికి పందిళ్ళు వేసి హడావిడి కొనసాగుతుంది . సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ప్రతి గ్రామం సిద్ధం అవుతుంది. పల్లెలే కాదు పట్టణాలు , నగరాల్లో కూడా దేవాలయాల వద్ద పందిళ్లు వేస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ పాటలు స్వామి కళ్యాణానికి ఆహ్వానం పలుకుతాయి .
లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!
శ్రీరామనవమికి కనిపించని హడావిడి .. లాక్ డౌన్ ప్రభావం
అలాంటిది ఈ సారి ఆ హడావిడి లేదు . కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటించాలని చెప్తున్న నేపధ్యంలో ఎవరికి వారు ఇళ్లలోనే పూజలకు పరిమితం అయ్యే పరిస్థితి . లాక్ డౌన్ తో బయటకు రాలేని స్థితి . ఇక స్వామి వారి కళ్యాణం చూడాలి అన్నా కేవలం టీవీలలోనే చూడాల్సిన పరిస్థితి . తెలంగాణలో భద్రాచలంలో రాముల వారి కళ్యాణం ఎలా నిర్వహిస్తారో చెప్పక్కర్లేదు. చూసేందుకు రెండు కళ్ళు చాలవు . అంత ఘనంగా స్వామి కళ్యాణం నిర్వహిస్తారు . భద్రాచలంలో స్వామి వారి కళ్యాణం జరిగిన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణం నిర్వహిస్తారు . ఇక అటు ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.
అయోధ్యలోనూ అట్టహాసంగా కళ్యాణానికి ప్లాన్ .. కరోనాతో బ్రేక్
అయితే, గత ఏడాది అయోధ్య వివాదంలో తీర్పు రామ జన్మ భూమిగా వచ్చిన కారణంగా ఈ ఏడాది అయోధ్యలో పెద్ద ఎత్తున రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని జరపాలని అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితి . ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని , ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టటానికి అందరూ పోరాటం చెయ్యాలని ఇళ్లకే పరిమితం అయ్యి సామాజిక దూరం , వ్యక్తిగత శుభ్రత పాటించటమే ధ్యేయం అని చెప్తున్న పరిస్థితుల్లో రాములోరి కళ్యాణం గురించి ఎవరూ బయటకు రాలేకపోతున్నారు . ఇక దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.
Recommended Video
ఇళ్లకే పరిమితమై రాములోరి కళ్యాణం టీవీల్లో చూసి తరించండి
చివరికి కన్నుల పండుగగా జరిగే భద్రాచలం దేవాలయంలో రాముల వారి కళ్యాణానికి కూడా భక్తులకు అనుమతి లేదు . భద్రాచలం దేవాలయంలో నిర్వహించే శ్రీసీతారాముల కళ్యాణాన్ని లైవ్ ద్వారా టీవీలో ప్రసారం చేయబోతున్నారు. ఇక స్వామి వారి కళ్యాణాన్ని టీవీలలో చూసి తరించాల్సిందే . కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కావాల్సిన ధైర్యం ఇవ్వాలని రాములవారిని కోరుకుంటూ పూజలు , పునస్కారాలు కూడా ఇళ్ళ వరకే పరిమితం . ఏది ఏమైనా కష్ట కాలంలో చాలా సహనంతో పోరాటం చేసిన రాముల వారిని ఆదర్శంగా తీసుకుని కరోనా మహమ్మారి తరుముతున్న నేటి కష్ట కాలంలో సహనంతో సామాజిక దూరం పాటిస్తూ , స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్షగా భావిస్తూ శ్రీరామనవమి జరుపుకుందాం .