తెలంగాణా హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్ ... రేపటి నుండి మూసివేత .. కేసుల విచారణ ఇలా !!
తెలంగాణ రాష్ట్రంలో కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు 1500కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నా,గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక కేసులు నమోదు అవుతుండటం హైదరాబాదీలకు ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పోలీసులు, న్యాయవాదులు, వైద్యులతో పాటు ప్రగతి భవన్ వర్గాలలో కూడా ప్రతి ఒక్క సెక్షన్ లోనూ కరోనాకేసులు నమోదయ్యాయి.
తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ హైకోర్టును పట్టి పీడిస్తుంది. తెలంగాణ హైకోర్టులో ఇప్పటివరకు మొత్తం 25 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో రేపటి నుంచి హైకోర్టును మూసివేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడి దృష్ట్యా హైకోర్టు మూసివేయాలని నిర్ణయించారు. హైకోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో హైకోర్ట్ ను పూర్తిగా శానిటైజ్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో హైకోర్టులోని కీలక ఫైల్స్ అన్నింటిని జ్యుడీషియల్ అకాడమీ తరలించనున్నారు.
ఇదే సమయంలో కేసుల విచారణకు ఇబ్బంది కలగకుండా,ముఖ్యమైన కేసులను మాత్రమే విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టును శానిటైజ్ చేసిన తరువాత కరోనా పరిస్థితులను సమీక్షించి తిరిగి ఎప్పుడు హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాలనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టు సిబ్బంది కరోనా రావడంతో అప్రమత్తమైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాకట్టడి కష్టంగా మారిన నేపథ్యంలోనే తాజాగా మూసివేత నిర్ణయం తీసుకున్నారు.