హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలు
హైదరాబాద్ ఖాళీ అవుతోంది.హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు నగరవాసులకు ఊపిరాడనివ్వడం లేదు. ఫలితంగా సొంత ఊర్లకు చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోగా, ఇప్పటికీ ఏపీ బాట పడుతున్న వారు చాలామందే ఉన్నారు.ఇప్పుడు నగర రహదారులు ఎలాంటి రద్దీ లేకుండా నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి.
Recommended Video
కరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చ
హైదరాబాద్ లో కరోనా పంజా.. సొంత ఊర్లకు నగర వాసులు
ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటివరకు 16,078 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నమోదైన కరోనా కేసుల్లో 15750 యాక్టివ్ గా ఉండగా 305 మంది మాత్రమే ఇప్పటివరకు రికవర్ అయ్యారు.హైదరాబాద్లో కరోనా మరణాలు చూసినట్లయితే 23 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. రోజురోజుకు భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో భయాందోళనలకు గురవుతున్న భాగ్యనగర వాసులు సొంత గ్రామాలకు పయనమయ్యారు.
హైదరాబాదీలు ఇళ్లకే పరిమితం.. బోసిపోయిన నగర వీధులు
స్థానికంగా నివాసం ఉండే హైదరాబాదీలు ఇళ్లకే పరిమితం అవడంతో భాగ్య నగర రహదారులు వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రయాణం చేయాలంటే విపరీతమైన ట్రాఫిక్ తో ఎక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయాయి. ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయాలన్న ఈజీగా ప్రయాణం చేసేలాగా నిర్మానుష్యంగా తయారయ్యాయి. తాజా పరిణామాలతో రోడ్లపైకి వస్తున్న వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం హైదరాబాదులో అదే పరిస్థితి కనిపిస్తుంది
హైదరాబాద్ ఖాళీ అవ్వటానికి కారణాలు ఇవే
హైదరాబాద్లో గత 15 రోజుల నుంచి చూసినట్లయితే ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో నగర రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాలతో హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నసెటిలర్స్ ఏపీ బాట పట్టారు. సొంత ఊర్లకు పయనమయ్యారు. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఉండటం, అలాగే కొందరు ఉద్యోగాలు పోగ్గోట్టుకోవటంతో సొంత ఊర్ల బాట పట్టారు.
బాగా తగ్గిన రద్దీ .. నగరం ఖాళీ అవుతున్న వేళ
ఒకప్పుడు కూకట్ పల్లి నుండి ఎల్బీనగర్ కు రావాలంటే రద్దీ సమయాల్లో కనీసం గంటకు పైగా పట్టేది. కానీ ఇప్పుడు ముప్పావుగంటలోనే చేరుకుంటున్నారు. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, వాహనచోదకులు రహదారుల మీదకు రావడం బాగా తగ్గించారని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో చూసినా ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతుండడం, ఇక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందడం లేదన్న ఆందోళన, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావన, టెస్టుల విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడి ఉందన్న అభిప్రాయం వెరసి భాగ్యనగర్ నిర్మానుష్యం గా తయారవుతుంది. భాగ్యనగర్ వాసుల గుండెల్లో కరోనా రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక భాగ్యనగర్ లో సెటిల్ అయిన వారు బతికుంటే బలుసాకు తిని అయినా బతకవచ్చని సొంత ఊర్ల బాటపట్టారు.