తెలంగాణలో 20 మంది చిన్నారులకు కరోనా .. గాంధీ ఆస్పత్రి ప్రత్యేక చిన్నారుల వార్డులో చికిత్స
కరోనా మహమ్మారి చిన్నారులను వదలటం లేదు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 మంది చిన్నారులు కరోనా పాజిటివ్ తో బాధ పడుతున్నారు . ఇక వీరికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
చిన్నారులు కావటంతో వారికి వైద్యం చెయ్యటం వైద్యులకు కాస్త ఇబ్బందిగా మారింది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 644కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి .ఇక ఇప్పుడు కరోనా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పెరగటం తెలంగాణా సర్కార్ ను ఇబ్బంది పెడుతుంది.
ఢిల్లీకి వెళ్లొచ్చి పట్టణమంతా తిరిగాడు: 19 మందికి సోకిన కరోనా, ఇంకెంతమందికి అంటించాడో?
కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుంది. ఇక వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. కరోనా బారిన పడుతున్న వారిలో చిన్నారుల సంఖ్య కూడా బాగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పటి వరకు కనీసం నెలకూడా నిండని పసికందు కూడా ఉన్నారు.
23 రోజుల పసి కందు నుండి 12 ఏళ్ల లోపు చిన్నారులు కరోనా బాధితులుగా మారారు . ఇప్పటి వరకు తెలంగాణా రాష్ట్రంలో 20 మంది చిన్నారులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరినంతా గాంధీఆస్పత్రిలోనే ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ చిన్నారులకు ప్రత్యేక వార్డులను కేటాయించటం మాత్రమే కాకుండా 20 మంది ప్రత్యేక డాక్టర్లను నియమించి వైద్యం అందిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలోని 6వ ఫ్లోర్లో చిన్నారులకు ప్రత్యేకవార్డును ఏర్పాటు చేశారు. అయితే,ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఓ బాలుడి కేసు మాత్రం డాక్టర్లుకు సవాల్గా మారింది.మూడేళ్ల బాలుడికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు కరోనా కూడా రావటంతో ఆ బాలుడికి ట్రీట్మెంట్ అందివ్వడం ఇబ్బందిగా మారింది.
ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి కాస్త విషమంగా ఉందని అంటున్నారు వైద్యులు . అందరూ చిన్నారులు కావటం , వారికి ఏమీ అర్ధం కాకపోవటం , చెప్పింది వినకుండా, ఆగకుండా తిరగటం , ఏడవటం చేస్తున్నారు . ఇక తల్లిదండ్రులకు వారి బాధ తీవ్ర మనో వేదనకు గురి చేస్తుంది .