నాన్నా.. అమ్మ జాగ్రత్త .. మృతికి ముందు కరోనా బాధితుడి చివరి మాటలు ..వైద్యం అందకనే !!
హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో ధైర్యంగా పోరాడాలి అనుకున్నారు.అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు.కరోనా టెస్టుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కనీసం ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా వైద్యం చేయించుకుందామని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఒక్కోచోట ఒక్కో కారణం చెప్పి ఈ ఆస్పత్రి, ఆ ఆస్పత్రి అంటూ మార్చడంతో వైద్యం అందక కరోనాతో పోరాడలేక తుదకు ప్రాణం విడిచాడు. ప్రాణం పోయే ముందు నాన్న అమ్మ జాగ్రత్త అంటూ తన ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని వారి వద్ద నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. హృదయవిదారకంగా అనిపిస్తున్న మృతి చెందిన కరోనా బాధితుడు అనుభవించిన కష్టం వారి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ..
తెలంగాణా హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్ ... రేపటి నుండి మూసివేత .. కేసుల విచారణ ఇలా !!
కరోనా బాధితుడికి పరీక్షలు చెయ్యటంలో జాప్యం
ప్రాణం నిలబెట్టుకోవడానికి వారంరోజులపాటు ఆసుపత్రులు తిరిగిన ఓ అభాగ్యుడు కథ ఇది . హైదరాబాద్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ జులై 1వ తేదీన మల్లాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత జూలై 3న అనారోగ్యం మరింత పెరగడంతో ఊపిరి అందడం లేదని గుర్తించి నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ కి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు లేకుంటేకరోనా పరీక్షలు చేయమని చెప్పడంతో ఆధార్ కార్డు కోసం తిరిగి ఇంటికి వచ్చాడు.ఆ రోజు పరీక్షలు చెయ్యలేదు. ఆ మరుసటిరోజు కరోనా పరీక్షల నిమిత్తం ఆధార్ కార్డు తీసుకుని వెళ్లగా రోజుకు 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని చెప్పడంతో వెనుదిరిగాడు. కరోనా పరీక్షలు నిర్వహించడానికే బాధితుడిని రెండు మూడు రోజులు తిప్పడంతో అప్పటికే ఆ వ్యక్తి పరిస్థితి సీరియస్ గా తయారయింది.
పడకలు లేవన్న ప్రైవేట్ ఆస్పత్రులు .. ఊపిరి ఆడక నరకం .. ఆపై మృతి
దీంతో జులై 6వ తేదీన సికింద్రాబాద్లోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాడు. అక్కడ పడకల సమస్య ఉందంటూ అతడిని తిప్పి వెనక్కి పంపించారు. ఆ ఆస్పత్రి , ఈ ఆస్పత్రి తిరుగుతూ అదే రోజు సాయంత్రం ఎల్బీ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు సదరు బాధితుడు. మరుసటి రోజు ఉదయం అతడ్ని ఐసియుకి తరలించాలని వైద్యులు చెప్పారు ఆ తర్వాత ఆక్సిజన్ సౌకర్యం లేదని కాబట్టి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అప్పటికే బాధితుడి నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం పంపించారు. బాధితుడికి ఆక్సిజన్ పెట్టడంలో జాప్యం, సరైన వైద్య చికిత్స అందించడంలో జరిగిన తాత్సారం వెరసి ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు .
వారం రోజుల పోరాటం తర్వాత తండ్రితో చివరి మాటలు
ఇన్ని ఆస్పత్రులు తిరిగిన తర్వాత మరో రెండు గంటల్లో తను మరణిస్తాననగా తండ్రితో మాట్లాడిన ఆ కొడుకు.. "నాన్నా .. చాలా దాహంగా ఉంది ..ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.. నా పరిస్థితి చేయి దాటి పోతోంది.. అది నాకు అర్ధం అవుతూనే ఉంది.. ఇక మీరు ఇంటికి వెళ్ళండి నాన్న.. అమ్మ జాగ్రత్త " అని చెప్పాడు.అవే అతను చెప్పిన చివరి మాటలు. ఆ తర్వాత రెండు గంటలకు అతని ఊపిరి ఆగిపోయింది. ఈ విషయం ఆ తల్లిదండ్రులు చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నారు. కరోనాతో పోరాడి ఇంటికి రావాలి అనుకొని ప్రయత్నం చేసిన సదరు వ్యక్తి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో, కరోనా పరీక్షలు చేయకపోవడంతో, సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో అతను మృతి చెందాడు.
కరోనా వైద్యంలో నిర్లక్ష్యమే కారణం
కరోనాతో పోరాడి ఓడిపోయాడు.అతను మృతి చెందిన తర్వాత అతని తండ్రికి మరొక బంధువుకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నాచారం పోలీసుల పర్యవేక్షణలో అతని అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడం, కరోనా పరీక్షలు నిర్వహించడంలో జరిగిన జాప్యం, ఆక్సిజన్ పెట్టకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకోక పోవడం వెరసి తమ కుమారుడి ప్రాణం కోల్పోయాడని లబోదిబోమంటున్నారు మృతుని బంధువులు.
తెలంగాణా ప్రభుత్వం చేతులెత్తేసిందా ? ప్రజల ఆవేదన
ఇలాంటి ఘటనలు నిత్యం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఒకపక్కన కరోనా మహమ్మారి తో పోరాటం సాగించాల్సిన సమయంలో, ఆసుపత్రుల తీరు, కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.దీనిపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణరక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నాయి. మొదట్లో ఒకటి రెండు కేసులు వస్తేనే హడావుడి చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా పట్టింపులేనట్లుగా ప్రవర్తిస్తున్న వైఖరి ప్రజలకు ప్రాణసంకటంగా తయారయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యల దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణా ప్రజానీకం ప్రాణాలు కాపాడండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు.