అంతా ‘మర్కజ్’ వాళ్లే: తెలంగాణలో 97కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం మరింత పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారి సోకిన వారి సంఖ్య తెలంగాణలో 97కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఇప్పటి ఆరుగురు మృతి చెందారని, 14 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
మర్కజ్ నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్..
ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చిన వారికి, వారి బంధువులకు కలిపి రాష్ట్రంలో కొత్తగా 15 మందికి మంగళవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
వారంతా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలి..
కరోనా తాజా పరిస్థితిపై మంత్రి ఈటెల మాట్లాడుతూ.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో మత ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి వచ్చిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని తెలిపారు. కరోనావైరస్ లక్షణాలున్నవారు, వారి బంధువులు కూడా పరీక్షల కోసం ఆస్పత్రికి రావాలని అన్నారు.
ప్రజలంతా ఇంట్లో ఉండి..
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా కరోనా కట్టడి కోసం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. డయాలసిస్, తలసేమియా, సికెల్సెల్ జబ్బులున్నవారికి రక్త మార్పిడి అవసరమవుతుందని, వీరిని ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇలాంటి జబ్బులున్నవారి ప్రయాణాన్ని అడ్డుకోవద్దని మంత్రి పోలీసులకు సూచించారు. గర్భిణీలకు ఇబ్బందులు లేకుండా మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.