మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ .. సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందన్న హెల్త్ డైరెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కరోనా చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు .తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబం కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటె ప్రభుత్వం మాత్రం కరోనా తగ్గుతుందని చెప్తుండటం గమనార్హం .
తెలంగాణాలో కరోనా బారిన పడిన మరో ఎమ్మెల్యే కుటుంబం... తాజాగా 2256 పాజిటివ్ కేసులు !!
మంత్రి మల్లారెడ్డికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్
ముఖ్యంగా అధికార పార్టీలో హోంమంత్రి మహమూద్ అలీ, జిహెచ్ఎంసి మేయర్ రామ్మోహన్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, నిజామాబాద్ అర్బన్ , రూరల్ ఎమ్మెల్యేలు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్య సైతం కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు వీరు ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు .
తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయన్న హెల్త్ డైరెక్టర్
మరోవైపు మల్లారెడ్డి కుటుంబసభ్యులకు మాత్రమే కాకుండా, ఇటీవల ఆయనను కలిసిన వారికి, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని,సెప్టెంబర్ నెలాఖరుకు తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని చెప్తున్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. తెలంగాణలో ప్రస్తుతం ఐదు శాతం పాజిటివ్ నమోదైందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం కరోనా నివారణ చర్యలకు మరో వంద కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
ఆగస్ట్ నెలాఖరుకు హైదరాబాద్ లో కరోనా కంట్రోల్ లోకి ..
తెలంగాణ రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో రోజుకి ఇరవై వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, రెండు వారాలు మాత్రమే ఉండే వైరస్ అని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆగస్టు చివరి వరకు చాలా వరకు కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, హైదరాబాదు తో పోల్చి చూస్తే జిల్లా కేంద్రాల్లో కరోనా విస్తరిస్తోందని పేర్కొన్నారు.
Recommended Video
సెప్టెంబర్ నెలాఖరుకు కరోనా తగ్గుతుందని ఆశాభావం
కరోనాను జయించాలంటే అందరూ ధైర్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు . రాష్ట్రంలో కరోనా కేసుల్లో రికవరీ ల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ చివరి వరకు తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.