ధూల్ పేటలో నిశ్చితార్ధం ధూమ్ ధామ్.. 15 మందికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి . ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా భాగ్యనగర వాసులకు కరోనాపై అవగాహన రావటం లేదు . దీంతో కరోనా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది . ఏ మాత్రం కేసులు తగ్గుముఖం పట్టటం లేదు . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్ మాత్రం కరోనాకు కేరాఫ్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది . మొన్నటికి మొన్న ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన పార్టీ ఏకంగా 23మంది కరోనా బాధితులుగా మారితే తాజాగా ధూల్ పేట లో ధూమ్ ధామ్ గా జరిగిన నిశ్చితార్ధం 15 మందిని కరోనా బాధితులుగా మార్చింది . ఒకరి ఉసురు తీసింది .
హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా
తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికి 1,634 కేసులు, హైదరాబాద్ లోనే 1,041 కేసులు
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఉన్న ధూల్ పేట ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది . అక్కడ సామాజిక దూరం పాటించకుండా జరిగిన ఒక నిశ్చితార్ధ వేడుకతో 15 మంది కరోనా సోకింది . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇలాంటి ఘటనలతో బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి . ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలోని కేసులను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 1,634 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 1,041 కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలో నమోదైన కేసుల్లో 713 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
నిశ్చితార్ధం ఎఫెక్ట్ .. 15 మందికి కరోనా
కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మే 11న హైదరాబాద్ ఓల్డ్సిటీలోని ధూల్పేట్లో ఓ నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది వరకు బంధువులు, స్నేహితులు హాజరైనట్టుగా తెలుస్తోంది. కరోనాబారిన పడి పెళ్లి కుమారుడి తండ్రి అస్వస్థతకు గురయ్యాడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఆ కుటుంబానికి, కొందరు బంధువులకు కరోనా టెస్ట్లు చేయగా ఇప్పటివరకు 15 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు .
కరోనా హాట్ స్పాట్ గా ధూల్ పేట ప్రాంతం
ఈ ఘటనతో హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ధూల్ పేట ప్రాంతం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఎవరి ద్వారా కరోనా సోకిందనేది అంతుపట్టడంలేదు.. దీంతో నిశ్చితార్థ వేడుకకు హాజరైన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు . వాళ్లకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఎవరెవరు నిశ్చితార్దానికి హాజరయ్యారో వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో 58 ఏళ్ల ఇంటి పెద్దను కోల్పోయి విషాదంలో మునిగిపోయింది.
ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్తుంది సర్కార్ . ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి వైరస్కు మందు లేదని , రాకుండా జాగ్రత్త పడటం ఒక్కటే మార్గం అని చెప్తున్న పరిస్థితి . సామాజిక దూరం పాటిస్తూనే, మాస్క్ తప్పనిసరి చేసింది సర్కార్. ఇక, లాక్డౌన్ నిబంధనల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర గుమ్మిగూడే కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వలేదు .పెళ్లికే 20 మందికి అనుమతి ఉంది. అయినప్పటికీ నిశ్చితార్దానికి మూడు వందల మందిని పిలిచి జాగ్రత్తలు పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపధ్యంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది ప్రభుత్వం .