తెలంగాణా జిల్లాల్లో కరోనా కల్లోలం .. నిజామాబాద్ లో 110 మంది పోలీసులకు కరోనా , వరంగల్ లో ఆక్సిజన కొరత
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసుల్లో తెలంగాణలో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు తెలంగాణ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 6542 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Recommended Video
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని, అనధికారికంగా చాలామంది కరోనా బారిన పడుతున్నారని, విపరీతంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. దారుణంగా ప్రభావితమైన నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . గడిచిన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 862 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఒక్క నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తుంది.
నిజామాబాద్ , నల్గొండ జిల్లాలలో కరోనా కల్లోలం
దీంతో నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. సరిహద్దులో ఉన్నమహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున ప్రజలు వలస రావటంతో నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజులోనే 1448 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆసుపత్రిలో వైద్య సదుపాయాల కొరత ఇబ్బంది పెడుతోంది.
వరంగల్ జిల్లాలో కరోనా కరాళ నృత్యం .. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత
ఇదిలా ఉంటే వరంగల్ జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో బాధితులు ఆసుపత్రుల బాటపట్టారు. దీంతో వైద్య సదుపాయాల లేమి వరంగల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు ఆక్సిజన్ లేమితో మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని చెబుతున్నప్పటికీ , ఆక్సిజన్ కర్త తెలంగాణ రాష్ట్రంలోని వేధిస్తోందని తాజా పరిస్థితులు చెబుతున్నాయి.
కోవిడ్ కంట్రోల్ రూమ్ లకు ప్లాస్మా కోసం వినతుల వెల్లువ
ఇక కోవిడ్ కంట్రోల్ రూమ్ లకు కరోనా బాధితుల నుండి విజ్ఞప్తులు వెల్లువగా మారాయి . ప్రతి రోజు 80 నుండి 100 వరకు ప్లాస్మా రిక్వెస్ట్ లు వస్తున్నట్లుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇక కరోనా యోధుల కోసం, ప్లాస్మా దాతల కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలోనూ కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. మహమ్మారి విశ్వరూపంతో భాగ్యనగరం విలవిలలాడుతోంది.
కరోనా దెబ్బకు బిక్కుబిక్కుమంటున్న భాగ్యనగరం
వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. వేల సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నా, సిబ్బంది కొరత, వైద్య సదుపాయాల లేమితో హైదరాబాద్లోనూ ఆసుపత్రి వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ జిల్లాలలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించి కరోనా కట్టడి యత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయినప్పటికీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కేసులతో మరింత కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం సైతం లేకపోలేదని తెలుస్తుంది.