కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని బీజేపీ రాష్ట్ర వ్యాప్త సమరభేరి ..బండి సంజయ్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్నా తెలంగాణ ప్రభుత్వ వైఖరి మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు నిర్వహించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు,ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్ తో ధర్నాలు నిర్వహించారు .కరోనా వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల్లో ఇబ్బందులపై, అలాగే వైద్యుల సమస్యలపై కూడా బీజేపీనేతలు పలు డిమాండ్లు చేశారు .
కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడి యత్నం చేసిన బీజేపీ నేతలు అరెస్ట్
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలలో భాగంగా కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముట్టడించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో, బీజేపీ నేతలు ప్రయత్నం చేశారు. ఇక వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ తో పాటుగా బిజెపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు .ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం పారాసిటమాల్ సీఎం
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పక్క తెలుగు రాష్ట్రంలో ఎన్ని టెస్ట్ లు చేశారో ఒకసారి గమనించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం పారాసిటమాల్ సీఎం గా మారారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు బండి సంజయ్.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
కరోనా వైద్యం అందించే ఆసుపత్రులలో వసతులు కరువయ్యాయి అని, డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నా, వారికి కూడా రక్షణ లేకుండా పోతుందని, పీపీఈ కిట్లు,మాస్కులు కూడా లేవని డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారని పేర్కొన్నారు బండి సంజయ్.అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని, జోకర్స్ లాగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో బిజెపి ఆధ్వర్యంలో కరోనా చికిత్స విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని ధర్నాలు నిర్వహించారు.
కరోనా విషయంలో ప్రభుత్వ వైఖరి మారాలని నిరసనలు
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేదా ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట్రంలో విధిగా అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా కేసీఆర్ మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడనాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లతో బీజేపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి . కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ ఆరోపిస్తూ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. జూబ్లిహిల్స్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మల్కాజ్గిరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇక కొన్ని చోట్ల బీజేపీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.