తెలంగాణాలో కరోనా మూఢ నమ్మకాలు ... గుండ్లు గీసుకుంటే కరోనా రాదంట !!
కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా వైరస్ నేపధ్యంలో పెరుగుతున్న వదంతులు, మూఢనమ్మకాలు విన్న వారిని షాక్ కు గురి చేస్తున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా రాకుండా ఉండాలంటే రక రకాల ప్రయోగాలు, పూజలు, వేప చెట్టుకు నీళ్ళు పోయటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదని, ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని చెప్పినా ఫేక్ వార్తలను నమ్ముతున్నారు.
తాజాగా గుండ్లు గీయించుకుంటే కరోనా రాదని తప్పుడు ప్రచారం
ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ప్రజలు తప్పుడు సమాచారాన్నే ఎక్కువగా నమ్ముతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది . ఒకవైపు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు, వైద్యులు, ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది . అయినా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మూఢనమ్మకాల ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. మొన్నటికి మొన్న వేపచెట్టుకు, గ్రామదేవతలకు పూజలు చేస్తే ఇక తాజాగా గుండ్లు గీయించుకుంటే కరోనా రాదని తప్పుడు ప్రచారం కొనసాగుతుంది.
గుండ్లు గీయించుకున్న 25 మంది యువకులు
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో తాజాగా ఒక మూఢ విశ్వాసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది . ముధోల్ మండలం చింతకుంట తండా గ్రామ పెద్ద గుండ్లు గీయించుకుంటే తమ గ్రామంలో కరోనా రాదని చెప్పారని కొందరు యువకులు గుండ్లు గీయించుకున్న ఘటన చోటు చేసుకుంది . గుండ్లు గీయించుకుంటే కరోనా రాదని ఊరంతా ప్రచారం కావడంతో గ్రామ ప్రజలు వరుసగా గుండ్లు కొట్టించుకుంటున్నారు. 25 మంది యువకులు ముందుగా వారి కులదైవానికి పూజలు చేసి ఆ తరువాత గుండు చేయించుకున్నారు. ఇక ఈ ఉదంతం కరోనా నేపధ్యంలో పెరుగుతున్న మూఢ నమ్మకాలకు ఉదాహరణగా నిలుస్తుంది .
నిర్మల్ లోని యువకులు గుండ్లతో ఫోటోలు.. పెరుగుతున్న మూఢ నమ్మకాలు
అంతే కాదు నిర్మల్ లోని యువకులు గుండ్లతో ఫోటోలు దిగి షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మాట్లాడుతూ హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య క్షేత్రాలకు వెళ్లినా, ఇంట్లో దగ్గరి వారు చనిపోయినా తల నీలాలు సమర్పించి గుండ్లు చేయించుకుంటున్నారని, ప్రస్తుతం కరోనా రాకుండా గ్రామదేవతలకు పూజలు చేసి గుండ్లు గీయిస్తున్నామని గ్రామ పెద్ద చెప్పారు. ఇక ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్న నేపధ్యంలో ఇలాంటివి నమ్మి పాటించే వారు పెరిగిపోయారు.
Recommended Video