టీఆర్ఎస్ లో తిష్ట వేసిన కరోనా ... ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే సునీతకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధులు దాకా ఏ ఒక్కరినీ వదలకుండా కరోనా తన ప్రతాపం చూపిస్తుంది. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో మాత్రం కరోనా కలకలం గా మారింది.
బ్రేకింగ్ ... తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్... అపోలోలో చికిత్స
అధికార పార్టీలో పెరిగిపోతున్న కరోనా బాధితులు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కరోనా సోకడంతో పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తుంది. కరోనా బాధితులు అధికార పార్టీలో పెరిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలన్నిటి కంటే అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా పాజిటివ్ ఆసుపత్రిలో చేరగా తాజాగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ గొంగడి సునీత కరోనా బారిన పడ్డారు.
ప్రభుత్వ విప్ గొంగడి సునీతకు కరోనా... యశోదాలో చికిత్స
గత నాలుగు రోజుల నుండి స్వల్ప అస్వస్థతకు గురైన గొంగిడి సునీత హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆమెకు యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక తనకు కరోనా పాజిటివ్ రావడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆ లక్ష్మీ నరసింహ స్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు ఆరోగ్యంగా వస్తాను అని గొంగిడి సునీత పేర్కొన్నారు.
టిఆర్ఎస్ పార్టీలోనే తిష్ట వేసిన కరోనా
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రైమరీ కాంటాక్ట్ లపై దృష్టి పెట్టారు . ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సామాజిక దూరాన్ని,మాస్కులు ధరించడాన్ని విపరీతంగా ప్రచారం చేసిన టిఆర్ఎస్ నాయకులు,వారే పాటించడం మరిచిపోయారు. దీంతో టిఆర్ఎస్ పార్టీలోనే కరోనా తిష్ట వేసింది. నాయకులకు ఊపిరాడకుండా చేస్తోంది.
ప్రగతి భవన్ కు కరోనా టెన్షన్
ఇదిలా ఉంటే ప్రగతి భవన్ కు కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది.ప్రగతి భవన్ సెక్యూరిటీ 30మందికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ప్రగతిభవన్ ను ప్రస్తుతం శానిటైజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. ఏది ఏమైనా ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు , ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తోంది.
Recommended Video
ఆందోళనకరంగా పెరుగుతున్న కరోనా .. టెన్షన్ లో అధికార పార్టీ నేతల పరిస్థితి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రాజకీయ నాయకులను వెంటాడుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరు ఎవర్ని కలవాలన్నా కరోనా భయం పట్టుకుంది. మొన్నటి దాకా తెగ తిరిగిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇక ఇప్పుడు ప్రభుత్వ విప్ గొంగడి సునీత కూడా కరోనా బాధితుల్లో చేరటం కారు పార్టీ నేతలకు షాకింగ్ న్యూసే .ఇక తాజా పరిణామాలు రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి.