టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్ .. జాగ్రత్త సార్లూ, అవగాహన కావాల్సింది మీకే : నెటిజన్ల సెటైర్లు
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇక దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. నిన్నటిదాకా కరోనా విషయంలో అవగాహన కల్పిస్తామని నాలుగు రోడ్లు తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు వారికే కరోనా ఎఫెక్ట్ పడుతుండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక వీరి కరోనా ఫోబియాపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
భారత్ లో 3.32 లక్షలకు పైగా .. గత 24 గంటల్లో 11,502 కేసులు .. ప్రపంచంలో 80 లక్షలకు చేరువలో
తెలంగాణా రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, శానిటేషన్ పనులు చేయించడం కోసం, నియోజక వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం కోసం రోడ్లు పట్టుకుని తెగ తిరిగిన ఎమ్మెల్యేలు, ఇక ఇప్పటికైనా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ గా తేలడంతో మిగతా వారంతా తలలు పట్టుకుంటున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వీరంతా చికిత్స పొందుతున్నారు.
జనగామ ఎమ్మెల్యేని కలిసిన వారిలో భయం
వివిధ కార్యక్రమాల్లో వీరంతా కలిసిమెలిసి పాల్గొనడంతోనే వీరికి వైరస్ సోకినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వీరిని కలిసిన ప్రజాప్రతినిధులకు సైతం ప్రస్తుతం టెన్షన్ పట్టుకుంది. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. నాడు కార్యక్రమానికి వచ్చిన చాలామందికి కరోనా టెన్షన్ పట్టుకుంది.
లాక్ డౌన్ సమయంలో తెగ తిరిగిన నేతలు ... అవేర్నెస్ ఇదేనా !!
అధికార పార్టీ కావడంతో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయం తెగ తిరిగారు ఎమ్మెల్యేలు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూనే, వారు జాగ్రత్తలు పాటించలేదు. కరోనా విషయంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారేమో గానీ ఎమ్మెల్యేలంతా కరోనా వైరస్ ను మాత్రం లైట్ తీసుకున్నారు. ఫలితంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. కరోనా ఆరంభంలో సీఎం కేసీఆర్ కూడా కరోనా అంటే లైట్ అన్నట్టే వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నెటిజన్ల సెటైర్లు
కరోనా లాక్డౌన్ సమయంలోనూ, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కూడా వీరంతా జోరుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరిని ఇతర ఎమ్మెల్యేలు కూడా పలు సందర్భాల్లో కలిశారు. దీంతో ప్రస్తుతం వీరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మిగతా ఎమ్మెల్యేలు కరోనా టెస్టులు చేయించుకోవాలంటే భయపడుతున్నారు. ఇక వీరి పరిస్థితి చూసి నెటిజన్లు మాత్రం తెగ సెటైర్లు వేస్తున్నారు.
Recommended Video
ఎమ్మేల్య సార్లూ .. కరోనాపై అవగాహన కావాల్సింది మీకే
సార్లు.. ఇల్లిల్లు తిరిగి కరోనా జాగ్రత్తలు తర్వాత చెబుతారు గాని ముందు మీరు జరభద్రం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా వచ్చిన ఎమ్మెల్యేలు పారాసిటమాల్ వేసుకోండి అంటూ సూచిస్తున్నారు. ఇక అంతే కాదు ప్రచారం పిచ్చితో ఫోటోలకు ఫోజులు ఇచ్చి కరోనాను ఆహ్వానించారు అంటూ ఎవరికి తోచినట్లుగా వారు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీల నేతలు, అధికార పార్టీ నేతలు చేసిన హదావిడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం మానేసి, ముందు మీరు కరోనాపై అవగాహన పెంచుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట హడావుడి తగ్గించి కాస్త ఇంటిపట్టునే ఉంటున్నట్లుగా సమాచారం.