పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల పైన కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తూనే ఉంది ముఖ్యంగా తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరోసారి కరోనా విరుచుకు పడింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఇంతటితో ఆగకుండా కరోనా వైరస్ పోలీసు శాఖను కూడా విడిచిపెట్టడం లేదు.
Coronavirus: ఫేమస్ ఆసుపత్రి వైద్య దంపతులకు కరోనా పాజిటివ్, చికిత్స చేసుకున్న 25 మందికి !
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు పాకిన కరోనా.. అప్రమత్తమైన అధికారులు..
అంతే కాకుండా ఇటీవలే ఆర్థిక శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ కార్యాలయానికి రావడానికి ఝంకుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే కార్యాలయానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచూ రసాయనాలను జల్లుతున్నారు.
ప్రభుత్వ శాఖల్లో కరోనా కల్లోలం.. సచివాలయ పరిసరాల్లో తీవ్ర ఆంక్షలు..
దీంతో మొత్తం బీఆర్కే భవన్లో ఇప్పటికి ఆరు కేసులు నమోదవ్వడమే కాకుండా ఈ నెమ్మదిగా పోలీసు శాఖకు పాకింది. ఇదిలా ఉండగా తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇందులో ఓ మహిళ ఐపీఎస్ అధికారికి కూడా కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అతడిని ఇప్పటికే హౌం క్వారంటైన్కు పంపించారు. అతనితోపాటు అడిషనల్ డీజీ స్థాయి అధికారి సహాయకుడికి పాజిటివ్ రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడుతున్నారు.
పోలీసు శాఖను షేక్ చేస్తున్న కరోనా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న నగర పోలీసులు..
డిపార్ట్ మెంట్ లో సహచరులకు కరోనా వ్యాప్తి చెందుతుండడంతో పోలీసు ఉన్నతాదికారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ పాజిటీవ్ నిర్ధారణ అయిన వారితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన పోలీస్ సిబ్బందిని అధికారులు యుద్ద ప్రాతిపదికన క్వారంటైన్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు విధులకు హాజరు కావద్దని ఆదేశాలు జరీ చేసారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే విధులకు రాకండి.. ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు..
కరోనా లక్షణలు కనిపిస్తే ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని బాదితులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో ఉండి ఎంతో సాహసోపేతంగా విధులు నిర్వహించారు పోలీసులు. దేశం మొత్తం కరోనాతో ఇంటికే పరిమితమైన తరుణంలో కేవలం పోలీసులు మాత్రమే తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. ఇలా ప్రజలను కరోనా నుండి కాపాడే ప్రయత్నంలో కొందరు పోలీసులే దాని బారిన పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం నుండి పోలీసులు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఆదేశాలు అందుతున్నట్టు తెలుస్తోంది.