నిజామాబాద్ పసుపు రైతులకు కరోనా వైరస్ దెబ్బ: రీజన్ ఇదే
ఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించటమే కాదు రైతన్నలకు తీరని వేదన మిగులుస్తుంది. పసుపు రైతుల ఆశల పై కరోనా వైరస్ నీళ్లు చల్లుతోంది. కరోనా వైరస్ ప్రభావం పసుపు ఎగుమతుల పడటంతో డిమాండ్ తగ్గి పసుపు ధరలు రోజురోజుకు పతనం అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించినా పంట సరిగా చేతికి రాక నానా ఇబ్బందులు పడిన రైతన్నలకు మార్కెట్ లో ధరల్లేక పీకల్లోతు కష్టాలు వచ్చి పడ్డాయి. ఇక మూలిగే నక్క మీద తాటికాయ చందంగా పసుపు రైతులకు కరోనా వైరస్ ఎఫెక్ట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
కరోనా సాకుతో వ్యాపారుల దోపిడీ
కరోనా సాకుతో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తుండగా ఎగుమతులు తగ్గడం, పాత నిల్వలు పేరుకుపోవడం వల్లే ధరలు తగ్గడానికి కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పసుపు నిజామాబాద్ రైతులకు ప్రధాన పంట . జిల్లా వ్యాప్తంగా సుమారు 40వేల ఎకరాలలో ఈ పంట సాగవుతోంది. పెట్టుబడి వ్యయం రెండింతలు పెరిగినా 9నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండించి మార్కెట్ కు తెస్తున్నారు రైతులు.
గిట్టుబాటు ధరలేక లబోదిబోమంటున్న రైతులు
పసుపు సీజన్ ప్రారంభం అయినా ఆశించిన మేర ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు .మార్కెట్ లో కర్షకులకు లభించే ధర పూర్తిగా పతనం అవుతోంది. ఎకరాకు లక్ష నుంచి లక్షా 20వేల ఖర్చు కాగా దిగుబడులు లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాల్ పసుపు ధర 4 వేల నుంచి 5వేల వరకు పలుకుతోంది. అసలే ధరల్లేక దిగాలు చెందుతున్న పసుపు రైతన్నలకు ప్రాణాంతకమైన కరోనా రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది.
ఐరోపా, చైనా దేశాలకు పసుపు ఎగుమతి లేక ధరల పతనం
నిజామాబాద్ పసుపును వ్యాపారులు అత్యధికంగా ఇరాన్ దేశానికి ఎగుమతి అవుతోంది. ఇరాన్ తో పాటు ఐరోపా, చైనా దేశాలకు సైతం పసుపును ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు పసుపు ఎగుమతి నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటు ఇరాన్ లో పరిస్దితులు బాగాలేకపోడంతో అక్కడికి సైతం ఎగుమతులు లేవని చెబుతున్నారు వ్యాపారులు. కరోసా సాకుతో పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కరోనా సాకు చెప్పి కొనుగోలుదారులు ధరలను పతనం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు
కన్నీరు పెట్టుకుంటున్న నిజామాబాద్ పసుపు రైతులు
నిజామాబాద్ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు ప్రసిద్ది చెందింది. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ తరవాత ఆ స్దాయిలో కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే జరుగుతాయి. సీజన్ ప్రారంభమైనా రైతులకు మాత్రం ధరల షాక్ తగులుతూనే ఉంది. రోజురోజుకు ధరలు పతనం కావటంతో అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 50వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వచ్చింది. ఈనెల 25 నుంచి పసుపు రాక మరింత పెరగనుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 3లక్షల క్వింటాళ్ల పసుపు నిల్వలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పాత నిల్వలకు తోడు చైనా, ఇరాన్ కు ఎగుమతులు తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు వేయి నుంచి 2వేలు తగ్గిపోయిన ధర
పసుపు ధరలు గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు వేయి నుంచి 2వేలు తగ్గిపోయింది. ప్రస్తుతం క్వింటాకు 4వేల నుంచి 5వేలకు మించి ధర పలకడం లేదు. ధరల పతనానికి ఎగుమతులు తగ్గిపోవడం, పాత నిల్వలు పేరుకుపోవడం కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గిందని కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులపై కరోనా ప్రభావం ఉందని అటు అధికారులు సైతం ఒప్పుకుంటున్న పరిస్థితి ఉంది .