హైదరాబాద్లో కరోనా వైరస్ టెన్షన్ .. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
Recommended Video
ఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కరోనా వైరస్ కారణంగా హడలెత్తిపోతుంది . ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కిల్లర్ కరోనా: 80కి చేరిన మృతుల సంఖ్య, చైనాలో భారతీయులు సేఫ్, విదేశాంగ శాఖ స్పష్టీకరణ
హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు
హైదరాబాద్ కు నిత్యం వివిధ దేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాంటి వారికి అధికారులు ప్రత్యేక వైద్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎవరైనా కరోనా వైరస్ బారిన పడిన వారిగా అనుమానం వచ్చినా ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక తనిఖీలు చేస్తున్న వైద్య సిబ్బంది వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు.
చైనా నుండి వచ్చిన ప్రయాణికుల్లో అనారోగ్య లక్షణాలు
ఇప్పుడు మనదేశానికి అందునా హైదరాబాద్ కు చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి అన్న కారణంగా వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది . అయితే చైనా నుండి హైదరాబాద్ కు వచ్చిన వారిలోఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్ధారిస్తేనే వారిని బయటకు పంపిస్తారు .ఇక వారికి సంబంధించిన కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉండేవారిని కూడా వారికి దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు వైద్య అధికారులు.
బ్లడ్ శాంపిల్స్ పూనేకు ..వ్యాధి లేదని నిర్ధారించిన వైద్యులు
ఇక అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ పంపిన నేపధ్యంలో రోగుల బ్లడ్ను టెస్ట్ చేసిన శాస్త్రవేత్తలు.. వారిలో ఎవరికీ కరోనా లేదని తేల్చి చెప్పారు. దీంతో.. తెలంగాణ వైద్య శాఖ ఊపిరి పీల్చుకుంది. ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి సుమారు రెండువారాలు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తిచెందే ప్రమాదముందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నవారి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి పరిమితం చేశారు అధికారులు.
కరోనా వైరస్ లక్షణాలు ఇవే .. అప్రమత్తత అవసరం
కరోనా వైరస్ లక్షణాలు చూస్తే ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది.తలనొప్పి, జ్వరం , దగ్గు , గొంతులో మంట ఉంటాయి .ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు . ఇక ఈ లక్షణాలు ఉంటె నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే డాక్టర్ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది . ప్రస్తుతానికి ఈ వైరస్కి మందు లేదని , ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెప్తున్నారు . ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్ చేయవద్దని చెప్తున్నారు . రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.