తెలంగాణ:ఒకేరోజు 4మృతి,99 కొత్త కేసులు.. హైదరాబద్లో ఆగని వైరస్ వ్యాప్తి..
లాక్ డౌన్ సడలింపులు పెరుగుతున్న కొద్దీ కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 99 మంది వైరస్ కాటుకు గురయ్యారు. వీళ్లలో స్థానికులు 87 మందికాగా, 12 మంది వలసకార్మికులని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో పేర్కొన్నారు. తాజా పెరుగుదలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,891కు చేరుకుంది. మంగళవారం మరో నలుగురు కరోనాతో చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 92కు పెరిగింది.
మంగళవారం వెలుగులోకి వచ్చిన 99 కేసుల్లో.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 70 కేసులు కాగా, రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, మేడ్చల్ జిల్లాలో 3, నల్గొండ జిల్లాలో 2, కేసులను గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ వ్యాధి నుంచి 1526 మంది కోలుకోగా, యాక్టివ్ కేసులు 1273గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మంగళవారం 8171 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. మరణాల సంఖ్య 6వేలకు చేరువైంది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 2287, తమిళనాడులో 1091, ఢిల్లీలో 1298 కొత్త కేసులు వచ్చాయి.