coronavirus Alert: తెలంగాణలో మరో కరోనావైరస్ కేసు, అతడూ దుబాయ్ నుంచే..
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ.. అక్కడక్కడా అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. అయితే, విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కరోనావైరస్ లక్షణాలు ఉండటం గమనార్హం. తాజాగా మరో కేసు బయటపడింది.
జగిత్యాలలో యువకుడికి కరోనా లక్షణాలు..
జగిత్యాల మండలం గోపాల్రావుపేటకు చెందిన 30ఏళ్ల యువకుడికి కరోనా వ్యాధి లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. వారం క్రితం దుయాబ్ నుంచి వచ్చిన యువకుడు దగ్గు, జలుబుతోపాటో కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. వారమైనా తగ్గకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడ్ని జగిత్యాల ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ప్రాథమికంగా పరీక్షించి సికింద్రబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపే పనిలో ఉన్నారు వైద్యులు.
ఒకే ఒక్క కేసు.. ప్రభుత్వం అప్రమత్తం..
కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనావైరస్ కేసు నమోదు కావడం గమనార్హం. అంతేగాక, ఇప్పటి వరకు కరోనా అనుమానితులుగా చేరిన వారందరికీ నెగిటివ్ అనే తేలంది. దీంతో ప్రభుత్వంతోపాటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కరోనా తెలంగాణలో లేదంటూ వైద్యారోగ్యశాక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రకటించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందన్నారు.
తెలంగాణ సర్కారుపై కేంద్రం ప్రశంసలు..
ఇది ఇలావుంటే, కరోనావైరస్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. కరోనావైరస్పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనావైరస్ నియంత్రణపై రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారు. కరోనావైరస్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తోందని.. మిగితా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్రం తరపున మంత్రి ఈటెల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్-95 మాస్కులను అందించాలని, రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు ఈటెల రాజేందర్.