43 కొత్త కేసులు, 272కి చేరిక: మూడ్రోజుల్లో లెక్క తేలుతుందన్న ఈటెల
ఢిల్లీ మర్కజ్ కారణంగానే తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే 3వేల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, వీరిలో 181 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంబంధీకులేనని చెప్పారు.
సామూహిక వ్యాప్తికి చేరలేదు..
తెలంగాణలో కరోనావైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. షాద్ నగర్లో వచ్చిన కేసు బీహార్ నుంచి వచ్చిన వలస కూలీ వల్ల సోకిందన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 30 మందికి, వారి కుటుంబసభ్యులకు మరో 13 మందికి కరోనా సోకిందని తెలిపారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసిన నలుగురికి, వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి, మొత్తం 48 మందికి కరోనా వచ్చిందని తెలిపారు.
మర్కజ్ కారణంగా పెరిగిన కేసులు
ఏప్రిల్ 4 నాటికి 14 రోజులు అయిపోతుండటంతో తెలంగాణలో కరోనా బారి నుంచి బయటపడుతుందని సీఎం కేసీఆర్ ఆశించారని తెలిపారు. కానీ, ఢిల్లీ మర్కజ్ కారణంగా తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి ఈటెల తెలిపారు. 181 మంది కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారివేనని చెప్పారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి కాంటాక్టులను కూడా పరీక్షలకు పంపిస్తామని, దీంతో రెండు మూడు రోజుల్లోగా 99శాతం కొలిక్కి వస్తుందని తెలిపారు. అయితే, మర్కజ్ కేసులకు మతంతో లింక్ పెట్టొద్దని అన్నారు.
మరో మూడో రోజుల్లో..
ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్టులను గుర్తించిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే కరోనా బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని మంత్రి ఈటెల తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లొచ్చిన 1095 మందిని గుర్తించామన్నారు. వారిలో 1081 మందిని అదుపులోకి తీసుకున్నామని, కరోనా పాజిటివ్ అని తేలితే వారితోపాటు వారి కుటుంబసభ్యులు, వారు కాంటాక్ట్ అయిన వారికి కూడాపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
43 కొత్త కేసులతో 272కి చేరిక
కరోనా పరీక్షలకు అనుమానితులు సహకరించాలని, లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి ఈటెల తెలిపారు. తెలంగాణలో ఆరు కేంద్రాల్లో.. రోజుకు 800-900 వరకు పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇక కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం లేదని తెలిపారు. కాగా, శనివారం ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల 272కు చేరింది.