తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా: కేటీఆర్ మెచ్చిన చిన్నారుల ఫొటో ఇదే!
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. ఎంసెట్ సహా మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కరోనావైరస్ వ్యాపిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఎవరో కొంత మంది మినహా దేశ వ్యాప్తంగా ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. అంతేగాక, సామాజిక దూరాన్ని కూడా పాటిస్తున్నారు. నగరాలు, పట్టణాల కంటే గ్రామాలు, తండాల్లోనే ప్రజలు ఎక్కువగా కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
My favourite pic of the week 😊
— KTR (@KTRTRS) April 12, 2020
Tiny tots teaching us adults the art of #Social_Distancing #StayHomeStaySafe #TelanganaFightsCorona pic.twitter.com/1G9psY95IH
తాజాగా, సామాజిక దూరం పాటిస్తున్న ఓ చిన్నారులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో కేటీఆర్ కూడా స్పందించారు. ఈ వారంలో నాకు ఎంతో నచ్చిన ఫొటో ఇది. ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు సామాజిక దూరం గురించి నేర్పిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అంతేగాక, జాగ్రత్తగా ఉండండి అని మంత్రి కేటీఆర్ సూచించారు. కాగా, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు చిన్నారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిన్నారుల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అంటున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తున్న ఈ చిన్నారులకు సెల్యూట్ అంటూ పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇది ఇలావుండగా, ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుండటంతో ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని డీజీపీ సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రజలను కోరుతున్నారు. మరో 15 రోజులు కూడా ప్రజలు ఇళ్లల్లోనే ఉండి తమతోపాటు సమాజాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలో 14 కరోనా మరణాలు సంభవించగా.. 500కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.