కరోనా ఎఫెక్ట్... బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని గణేష్ ఉత్సవ కమిటీలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి 21 అడుగుల విగ్రహానికి బదులు కేవలం ఆరడగుల విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది.
ఈ ఏడాది లడ్డూ వేలాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. లడ్డూ వేలానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల పూజలు, దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. కేవలం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే గణనాథుడికి పూజలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక గణేశ్ శోభాయాత్రపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ సమితి స్పష్టం చేసింది.
కరోనా వైరస్ ప్రభావంతో ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది 65 అడుగుల ద్వాదశాదిత్య మహాగణపతిని ఏర్పాటు చేయగా... ఈసారి కేవలం 27 అడుగులతో ధన్వంతరి వినాయకుణ్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాదు,ఈసారి పూర్తిగా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ భావిస్తోంది. అయితే భక్తుల దర్శనంపై ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.ఆన్లైన్ ద్వారా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణ రోజుల్లో అయితే వినాయక చవితి వచ్చిందంటే.... గల్లీ గల్లీకి నాలుగైదు వినాయకులను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎక్కువ సంఖ్యలో వినాయకుల ఏర్పాటుకు అనుమతులు కష్టమే. అలాగే శోభాయాత్రలకు కూడా అనుమతి ఇచ్చేది అనుమానమే. కాబట్టి గతేడాదితో పోలిస్తే ఈసారి వినాయక చవితి హడావుడి కాస్త తగ్గవచ్చు.