తెలంగాణ మంత్రికి కరోనా దెబ్బ.. వ్యాపారంలో తీవ్ర నష్టం..
ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్ను కూడా భయపెడుతోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం(మార్చి 6) నాటికి దేశంలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రతికూలతను పెంచింది. దీంతో ఒక్క తెలంగాణలోనే పౌల్ట్రీ పరిశ్రమ రూ.1000కోట్లు నష్టపోయింది. పౌల్ట్రీ వ్యాపారాలు కలిగిన తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ కూడా రూ.8కోట్లు వరకు నష్టపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఈటెల రాజేందర్ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను కూడా నష్టపోయినట్టు తెలిపారు. వైద్యశాఖ మంత్రి హోదాలో కరోనాపై ప్రతీరోజూ విస్తృత సమీక్షలు జరుపుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీసులోనే స్నానం చేసి రావాలని కుటుంబ సభ్యులు చెబుతున్నారన్నారు.
ఇక గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా ఐసోలేషన్ వార్డును ఎక్కడికీ తరలించట్లేదని,అక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైతే తెలంగాణ కరోనా ఫ్రీగా ఉందని.. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వం,వైద్యులు ఇస్తున్న సలహాలు,సూచనలు పాటించాలన్నారు. డిమాండ్ పేరుతో మెడికల్ షాపుల్లో మాస్కులను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవన్నారు. ప్రజలు మాస్కులే ధరించాల్సిన అవసరం లేదని.. కర్చీఫ్లు కట్టుకోవచ్చునని సూచించారు. బస్సుల్లో ప్రయాణించడం వల్ల కరోనా సోకదని.. ఆందోళన చెందవద్దని అన్నారు. కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో అపోహలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మవద్దని అన్నారు. గురువారం గాంధీ ఆసుపత్రికి 21 కరోనా అనుమానిత కేసులు వచ్చాయని, శుక్రవారం 10 కేసులు మాత్రమే వచ్చాయని అన్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్నారు.
ఇక కరోనా ట్రీట్మెంట్కు సంబంధించి కొన్ని ప్రైవేట్ ఆస్పతులకు కూడా అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండేందుకు ఇష్టపడని సంపన్నులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరాలనుకుంటున్నారని చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జిల మేరకే ఫీజులు వసూలు చేయాలన్నారు.