coronavirus - బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్ పెద్దల సమావేశం, ఇక సినిమా థియేటర్ల బంద్
హైదరాబాద్: తెలంగాణలో ఒక కరోనా వైరస్ కేసు నమోదవగా, మరో రెండు కేసులపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు అనుమానితులు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కూడా కరోనావైరస్ అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. విజయవాడ, ఏలూరులో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
సినిమా థియేటర్ల బంద్..
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులపాటు థియేటర్లను మూసివేయాలని సినీపెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో టాలీవుడ్ సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని పలువురు సీనియర్లకు బుధవారం సాయంత్రం మెసేజ్లు వెళ్లాయి.
సినిమా షూటింగ్ల వాయిదా సహా కీలక నిర్ణయాలు..
కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్లను కూడా వాయిదా వేసుకోవడం, కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, కరోనా విజృంభించిన చైనాలోని ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి.
సినిమా హాళ్లలో కరోనా వైరస్ వ్యాపించే ఛాన్స్..
సినిమాల్లో కిక్కిరిసిపోయే ప్రజల మధ్య వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకే ప్రమాదం ఉండటంతో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ హీరోలు కూడా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
Recommended Video
కరోనాపై స్పందిస్తున్న టాలీవుడ్ హీరోలు..
విమానాశ్రయంలో ముఖానికి మాస్కు ధరించిన హీరో ప్రభాస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోలపైనా కరోనా ప్రభావం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలు, అభిమానులకు సూచించారు. మహేశ్ తోపాటు మరికొందరు హీరోలు కరోనాపై కూడా అభిమానులు, ప్రజలకు సూచనలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రతితోపాటు పలు కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నాయి. తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో గురువారం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలను చేపడుతోంది.