భద్రాద్రి శ్రీరాముడి కల్యాణాన్ని వదలని రక్కసి: ప్రజలకు నో పర్మిషన్, తొలగిస్తోన్న చలువ పందిళ్లు..
భద్రాద్రి రాములోరి కల్యాణంపై కూడా కరోనా రక్కసి ప్రభావం చూపిస్తోంది. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగే వివాహా మహోత్సవ వేడుకకు ప్రజలు హాజరుకావొద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. శ్రీరామడు-సీతమ్మ వివాహాం మాత్రం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. బ్రాహ్మణులు, 50 మంది వరకు మాత్రమే ఆలయంలో మాత్రమే కల్యాణం జరిపించాలని ప్రభుత్వం స్పష్టంచేయడంతో.. ఆ దిశగా దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇసుకవేస్తే రాలనంతా జనం.. ఏటుచూసినా శ్రీరామనామ జపంతో సాగే భద్రాద్రి సీతారాముల కల్యాణంపై ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం చూపింది. ప్రజలు హాజరుకావొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే వేసిన చలువ పందిళ్లను తొలగిస్తున్నారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో అర్చకులతో మాత్రం శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
కల్యాణం కోసం హాజరయ్యేందుకు ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పువ్వాడ స్పష్టంచేశారు. వైరస్ దృష్ట్యా ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజలు సహకరించాలని కోరారు. రాములొరి కల్యాణాన్ని టీవీలో చూడాలని భక్తులకు అజయ్ కోరారు.
ఇటు ఏపీలో కూడా వైరస్ ప్రభావం చూపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒంటిమిట్ట రాములొరి కల్యాణ ఉత్సవాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. బహిరంగ స్థలంలో కాకుండా ఆలయంలోనే కల్యాణం జరిపిస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. 2015కు ముందు ఒంటిమిట్టలో ఆలయంలోనే కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాతే బహిరంగ ప్రదేశంలో కల్యాణం నిర్వహిస్తుండగా.. వేలాది మంది భక్తులు తరలొస్తున్నారు. కానీ ఈ సారి అవకాశం లేదు.