బండి సంజయ్ అరెస్ట్: జాతీయ బీసీ కమిషన్ సీరియస్, తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు
హైదరాబాద్: హైదరాబాద్: సిద్దిపేటలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను అరెస్టు చేయడంపై జాతీయ బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. సంజయ్పై పోలీసుల దురుసు ప్రవర్తన వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి జాతీయ బీసీ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.
నవంబర్ 5 లోగా నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొంది. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అని కూడా చూడకుండా తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, చేయి చేసుకున్నారని బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. అంతేగాక, సిద్దిపేట, సీపీ, సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
తనపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సస్పెండ్ చేయాలని ట్విట్టర్ వేదికగా విన్నవించారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సోమవారం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీలోని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ సురభి రాంగోపాల్ రావు, పక్కనే ఉన్న సురభి అంజన్ రావు ఇంట్లో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారని సీపీ తెలిపారు.
ఈ సోదాల్లో అంజన్ రావు ఇంట్లో 18.67 లక్షల నగదును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి.. అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో రఘునందర్ రావును పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్ను సిద్దిపేటలో పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు.
ఆ తర్వాత సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కరీంనగర్ పంపించేశారు. దీంతో సంజయ్ సోమవారం రాత్రి నుంచి కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. మంగళవారం రాత్రి బీజేపీ సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్లు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.